విషమంగానే ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం.. ఐసీయూలో కొనసాగుతోన్న చికిత్స
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పరిస్ధితి ఇంకా విషమంగానే వున్నట్లు గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్య బృందం ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తోందని వెల్లడించారు.
తీవ్ర అనారోగ్యంతో గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పరిస్ధితి ఇంకా విషమంగానే వున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం మేదంతా మెడికల్ డైరెక్టర్ సంజీవ్ గుప్తా ఒక బులెటిన్ విడుదల చేశారు. ములాయం సింగ్ యాదవ్ ఇప్పటికీ ప్రాణాలను రక్షించే మందులను ఉపయోగిస్తున్నారు. నిపుణులైన వైద్య బృందం ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తోందని సంజీవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా.. ఆదివారం మధ్యాహ్నం ఆరోగ్యం క్షీణించడంతో ములాయం సింగ్ యాదవ్ గురుగ్రామ్లోని వేదాంత ఆసుపత్రిలో చేరారు. దీంతో పార్టీ 30వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా జరుపుకోలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములాయం సింగ్ యాదవ్ సాధారణ చెకప్ల కోసం ప్రతి నెలా గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి వచ్చేవారు. అయితే ఈసారి మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే.. ఎస్పీ చీఫ్ సమస్య అస్థిర ఆక్సిజన్ స్థాయిలు మాత్రమే కాదు. దీంతో పాటు ఆయన కిడ్నీ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలే కాకుండా ములాయం సింగ్ యాదవ్ రక్తపోటు కూడా అదుపులో లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన బీపీ బాగా తగ్గుతోంది. ఇందుకోసం వారికి అధిక యాంటీబయాటిక్ డోస్ ఇస్తున్నారు. ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది, దీంతో అతడికి వెంటిలేటర్పై చిక్సిత అందిస్తున్నారు. దీంతో పాటు కిడ్నీ సమస్య కారణంగా డయాలసిస్ కూడా చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు ఫోన్ చేసి ములాయం ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన చికిత్సకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని. అలాగే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా ఆయనను పరామర్శించారు.