మరింత విషమించిన ములాయం ఆరోగ్యం.. ఐసీయూకు తరలింపు.. పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి దూరం..
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉందని , అక్టోబర్ 4న ఆయనను గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)కి తరలించినట్లు ఆసుపత్రి తెలిపింది.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మూడో రోజు ఐసీయూ యూనిట్లో వెంటిలేటర్ సపోర్టులో ఉన్నారు. అతని పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఆదివారం మధ్యాహ్నం ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్లోని వేదాంత ఆసుపత్రిలో చేరారు. ములాయం సింగ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఈరోజు పార్టీ 30వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా జరుపుకోలేదు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మౌనం పాటించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములాయం సింగ్ యాదవ్ సాధారణ చెకప్ల కోసం ప్రతి నెలా గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి వచ్చేవారు. అయితే ఈసారి మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే.. ఎస్పీ చీఫ్ సమస్య అస్థిర ఆక్సిజన్ స్థాయిలు మాత్రమే కాదు. దీంతో పాటు ఆయనకు కిడ్నీ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలే కాకుండా ములాయం సింగ్ యాదవ్ రక్తపోటు కూడా అదుపులో లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం అతడి బీపీ బాగా తగ్గుతోంది. ఇందుకోసం వారికి అధిక యాంటీబయాటిక్ డోస్ ఇస్తున్నారు. ఊపిరితిత్తుల సమస్య కారణంగా అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది, దీంతో అతడికి వెంటిలేటర్పై చిక్సిత అందిస్తున్నారు. దీంతో పాటు కిడ్నీ సమస్య కారణంగా డయాలసిస్ కూడా చేశారు.
ములాయం సింగ్ పరిస్థితిని తెలుసుకునేందుకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు ఫోన్ చేశారు. దీంతో పాటు అతడి చికిత్సకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా ఆయనను పరామర్శించారు.
పార్టీ వ్యవస్థాపక దినోత్సవం
ఎస్పీ అధినేత అనారోగ్యం కారణంగా మంగళవారం పార్టీ 30వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోలేదు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో నిశ్శబ్దం నెలకొంది. 1992 అక్టోబర్ 4న సమాజ్ వాదీ పార్టీ స్థాపించబడింది.