Asianet News TeluguAsianet News Telugu

UP Polls 2022: ములాయం ఫ్యామిలీని టార్గెట్ చేసిన కమలనాథులు.. నిన్న కోడలు, ఇవాళ తోడల్లుడిని లాగేసిన బీజేపీ

ములాయం సింగ్ యాదవ్ (mulayam singh yadav) తోడల్లుడు, ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్‌ గుప్తా (Pramod Gupta) బీజేపీలో చేరారు. గురువారం బీజేపీ సీనియర్‌ నేతల సమక్షంలో ప్రమోద్‌ గుప్తా కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ మాజీ నాయకురాలు ప్రియాంక మౌర్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  

mulayam singh yadav brother in law pramod gupta joins in bjp
Author
Lucknow, First Published Jan 20, 2022, 3:10 PM IST

ఇటీవల ముగ్గురు మంత్రులు సహా పలువురు కీలక నేతలను సమాజ్‌వాదీ (samajwadi party) పార్టీలోకి లాగిన అఖిలేశ్ యాదవ్ (akhilesh yadav) అధికార బీజేపీని డిఫెన్స్‌లోకి నెట్టిన సంగతి తెలిసిందే. అయితే కమలనాథులు సైతం అంతే దూకుడుగా అఖిలేశ్‌ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. నిన్న అఖిలేశ్ తమ్ముడి భార్య అపర్ణా యాదవ్‌ (aparna yadav) కాషాయ కండువా కప్పుకోవడంతో యూపీ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీకి బీజేపీ మరో షాకిచ్చింది. ఈసారి కూడా ములాయం కుటుంబాన్నే కాషాయ దళం టార్గెట్ చేసింది. 

ములాయం సింగ్ యాదవ్ (mulayam singh yadav) తోడల్లుడు, ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్‌ గుప్తా (Pramod Gupta) బీజేపీలో చేరారు. గురువారం బీజేపీ సీనియర్‌ నేతల సమక్షంలో ప్రమోద్‌ గుప్తా కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ మాజీ నాయకురాలు ప్రియాంక మౌర్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  

ఈ సందర్భంగా ప్రమోద్‌ గుప్తా మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాఫియా, నేరస్థులను ఎస్పీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. అంతేగాక, పార్టీ వ్యవస్థాపకుడైన నేతాజీ (ములాయం సింగ్‌ యాదవ్‌) పార్టీలో ఖైదీగా మారిపోయారని.. ఆయన, శివపాల్‌ యాదవ్‌ పట్ల అఖిలేష్‌ దారుణంగా ప్రవర్తిస్తున్నారని ప్రమోద్ గుప్తా మండిపడ్డారు. ఇక అలాంటి పార్టీలో ఉండలేనని.. అందుకే బీజేపీలో చేరుతున్నానని ఆయన చెప్పారు.

ములాయం సతీమణి సాధనా గుప్తా (sadhana gupta) సోదరి భర్తే ప్రమోద్‌ గుప్తా. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఖిలేష్‌కు, ఆయన బాబాయి శివపాల్ యాదవ్‌కు (shivpal yadav) మధ్య విబేధాలొచ్చాయి. దీంతో శివపాల్‌ ఎస్పీ నుంచి బయటకొచ్చి ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ) పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. ఇదే సమయంలో ప్రమోద్‌ గుప్తా కూడా ఎస్పీని వీడి పీఎస్పీలో చేరారు.

కాగా.. ఇటీవల శివపాల్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ మళ్లీ ఒక్కటైన విషయం తెలిసిందే. దీనిపై శివపాల్‌ వర్గీయులు అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రమోద్‌ యాదవ్‌ బీజేపీలో చేరడం యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో మరింత మంది శివపాల్‌ వర్గీయులు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పరిణామాలు సమాజ్‌వాదీ పార్టీని కలవరపెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ పోటీ వుంటుందని సర్వేలు చెబుతున్నాయి.  దీంతో ఇరు పార్టీలలో వలసలు కీలకంగా మారాయి. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా... మార్చి 10న ఫలితాలు ప్రకటించనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios