ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి బెదిరింపులు.. ఎనిమిది సార్లు కాల్స్.. ఒకరి అరెస్టు
ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి ప్రాణ హాని తలపెడుతామని ఈ రోజు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ డిస్ ప్లే నెంబర్కు ఈ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. స్వాతంత్ర్య దినోత్సవం నాడే ఆయనకు ప్రాణహాని తలపెడుతామని ఎనిమిది సార్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్కు ఈ ఫోన్ కాల్స్ వచ్చినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ డిస్ప్లే నెంబర్పై ఈ బెదిరింపులు వచ్చాయని ముంబయి పోలీసులు తెలిపారు.
రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అధికారులు వెంటనే డీబీ మార్గ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తం ఈ రోజు ఎనిమిది బెదిరింపు కాల్స్ వచ్చినట్టు వారు ఆరోపించారు.
రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నుంచి తమకు ఫిర్యాదు అందిందని ముంబయి పోలీసు స్టేషన్కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని చెప్పారు. హాస్పిటల్ డిస్ ప్లే నెంబర్పై ఈ బెదిరింపులు వచ్చినట్టు కనిపిస్తున్నదని వివరించారు. ఈ ఫిర్యాదు అందగానే పోలీసులు రంగంలోకి దిగారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబయిలోని పశ్చిమ సబ్ అర్బ్స్ నుంచి అరెస్టు చేసినట్టు తెలిసింది.
ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి ప్రాణ హానీ తలపెడుతామని గుర్తు తెలియన వ్యక్తుల నుంచి మొత్తం 8 బెదిరింపు కాల్స్ వచ్చాయని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ తరంగ్ జ్ఞానచందాని మిడ్ డే పత్రికకు తెలిపారు.
గతంలో ఒక సారి ముకేశ్ అంబాని నివాసం అంటీలియా నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో ఓ స్కార్పియో పార్క్ చేసిన ఉండటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ముంబయి పోలీసులు తెలియగా సచిన్ వాజే సారథ్యంలో వెంటనే దర్యాప్తును ప్రారంభించారు.
ఆ స్కార్పియో ఓనర్ మన్సుఖ్ హిరేన్ అని తేలింది. థానేకు చెందిన బిజినెస్ మ్యాన్ మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసులో అనేక సంశయాలు బయటకు రావడంతో దర్యాప్తును ఎన్ఐఏకు అప్పజెప్పారు. తన వాహనానం వారం కిందటే చోరీకి గురైందని మరణించడానికి ముందు మన్సుఖ్ హిరేన్ పేర్కొని ఉన్నారు. 2021 మార్చి 5వ తేదీన మన్సుఖ్ హిరేన్ డెడ్ బాడీ థానేలోని ఓ చిన్న ఏరులో కనిపించింది.