ఈ డ్రెస్సులతో అబ్బాయిలను రెచ్చగొడుతున్నారు.. ప్రిన్సిపల్ షాకింగ్ కామెంట్స్
యూనిఫాం వేసుకోకుండా స్కూల్ కి వచ్చిన అమ్మాయిలను ఉద్దేశించి.. వారి ఒంటిపై దుస్తులను తొలగించాలని అన్నాడు. ఆ దుస్తులతో అబ్బాయిలను రెచ్చగొడుతున్నారనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేయడం గమనార్హం.
భారతీయ సమాజంలో లింగ వివక్ష ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిలపై చాలా కామెంట్స్ చేశారు. తాజాగా ఓ స్కూల్ ప్రిన్సిపల్.. తమ కాలేజీలోని విద్యార్థినుల దుస్తులపై చేసిన కామెంట్స్.. తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్.. తమ స్కూల్లో చదువుతున్న విద్యార్థినుల దుస్తులపై కామెంట్స్ చేశారు. యూనిఫాం వేసుకోకుండా స్కూల్ కి వచ్చిన అమ్మాయిలను ఉద్దేశించి.. వారి ఒంటిపై దుస్తులను తొలగించాలని అన్నాడు. ఆ దుస్తులతో అబ్బాయిలను రెచ్చగొడుతున్నారనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేయడం గమనార్హం.
దీంతో.. ప్రిన్సిపల్ పై ముగ్గురు బాలికలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో.. ప్రిన్సిపల్ రాధేశ్యాం మాళవ్య(50) పై కేసు నమోదు చేశారు. కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లు ఇప్పుడిప్పుడే తెరుచకుంటున్న సంగతి తెలిసిందే.
దీంతో.. యూనిఫాం కుట్టించుకోలేదని.. అందుకే మామూలు డ్రెస్ వేసుకొని వచ్చామని బాలికలు టీచర్స్ కి చెప్పారు. అయితే.. యూనిఫాం లేదని.. ఆ డ్రెస్ లు తీసేయండంటూ ప్రిన్సిపల్ వారిపై మండిపడటం గమనార్హం. అబ్బాయిలను పాడుచేస్తున్నారంటూ ఆయన చెబుతుండగా.. కొందరు వీడియో తీయగా.. అది కాస్త వైరల్ గా మారింది. కాగా.. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.