జగన్ బాటలో మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్: నేరుగా ఇళ్లకే రేషన్
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దారిలోనే వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే మధ్యప్రదేశ్లోనూ రేషన్ సరుకులను డోర్ డెలివరీ విధానంలో పంపిణీ చేయాలని సీఎం చౌహాన్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆయన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
భోపాల్: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాటలోనే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినట్టుగానే మధ్యప్రదేశ్లోనూ రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో రేషన్ను డోర్ డెలివరీ చేసే పథకాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని 89 గిరిజన బ్లాక్లలో ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
గిరిజన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించడానికి నిర్వహించిన గౌరవ్ దివస్ ప్రోగ్రామ్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. నవంబర్ 1 నుంచి 89 ట్రైబల్ బ్లాక్లలో రేషన్ సరుకులను డోర్ డెలివరీ విధానంలో లబ్దిదారుల చెంతకు తీసుకెళ్తామని ప్రకటించారు. మధ్యప్రదేశ్ ఫౌండేషన్ డేగా జరుపుకునే నవంబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. గిరిజనలు ప్రత్యేకంగా వారి పనులు వదిలిపెట్టి రేషన్ షాప్లకు వచ్చి క్యూలో నిలుచోవాల్సిన అవసరం లేదని అన్నారు. గిరిజనుల యాజమాన్యంలోని వాహనాల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులకు లబ్ది జరిగిందని సీఎం అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనే గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడని గుర్తుచేశారు. గిరిజన విద్యార్థుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ. 200 నుంచి రూ. 300 వరకు స్కాలర్షిప్ అందించిందని, తాము దీన్ని నెలకు రూ. 1100కు పెంచామని వివరించారు.