ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఒక గ్రామంలో అధికారులు చేపట్టిన అక్రమణల కూల్చివేత ప్రక్రియ తీవ్ర విషాదాన్ని నింపింది. కూల్చివేతల సమయంలో అగ్ని ప్రమాదంలో తల్లీకూతురు మరణించారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఒక గ్రామంలో అధికారులు చేపట్టిన అక్రమణల కూల్చివేత ప్రక్రియ తీవ్ర విషాదాన్ని నింపింది. కూల్చివేతల సమయంలో అగ్ని ప్రమాదంలో తల్లీకూతురు మరణించారు. ఇందకు సంబంధించి హత్య కేసు కూడా నమోదైంది. 13 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. హత్య కేసు అభియోగాలు మోపినవారిలో సబ్డివిజనల్ మేజిస్ట్రేట్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, బుల్డోజర్ ఆపరేటర్తో పాటు మరికొందరు ఉన్నారు. వివరాలు.. జిల్లాలోని రూరా ప్రాంతంలోని మదౌలి గ్రామంలో పోలీసులు, జిల్లా యంత్రాంగం, రెవెన్యూ అధికారులు "గ్రామ సమాజ్" లేదా ప్రభుత్వ భూమి నుంచి ఆక్రమణలను తొలగించడానికి సోమవారం అక్కడికి వెళ్లారు. అయితే అధికారులు తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని.. ఉదయం బుల్డోజర్తో నేరుగా వచ్చాని గ్రామస్థులు చెప్పారు.
అయితే కూల్చివేత సమయంలో ప్రమీల, ఆమె కూతురు నెహా గుడిసెలో ఉండగానే నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో వారిద్దరు సజీవ దహనమయ్యారు. అయితే మంటల నుంచి పలువురు స్పల్ప గాయాలతో గాయపడ్డారు. అయితే ప్రమీల, నెహాలు గుడిసెలో ఉండి నిప్పంటించుకన్నారని పోలీసులు సోమవారం తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు.
ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. దీంతో పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్తో పాటు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కాన్పూర్ జోన్) అలోక్ సింగ్, డివిజనల్ కమిషనర్ రాజ్ శేఖర్తో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థులను శాంతింపజేశారు. ఈ ఘటనకు విచారణకు ఆదేశించినట్లు రాజ్ శేఖర్ తెలిపారు. ‘‘ఇది చాలా దురదృష్టకర సంఘటన. మేము బాధ్యులను విడిచిపెట్టము’’ అని చెప్పారు.
‘‘మాకు తెలిసిన సమాచారం ప్రకారం, ఒక మహిళ, ఆమె కుమార్తె గుడిసెలోపల ఉండి తాళం వేసుకుని నిప్పంటించారు. ఇది వారి మరణానికి దారితీసింది. మేము సంఘటనా స్థలానికి చేరుకున్నాము. సంబంధిత అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మేము దర్యాప్తు చేస్తాం. ఏదైనా తప్పు జరిగితే, మేము దోషులను విడిచిపెట్టము’’ అని పోలీసు సూపరింటెండెంట్ బీబీజీటీఎస్ మూర్తి అన్నారు. అక్రమణలకు వ్యతిరేకంగా డ్రైవ్ చేపట్టినప్పుడు వీడియో చిత్రీకరణ చేయాల్సి ఉంటుందని.. దానిని సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులను కోరినట్టుగా చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి రాష్ట్రంలోని అధికార బీజేపీపై సమాజ్వాదీ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ‘‘యోగి ప్రభుత్వంలో బ్రాహ్మణ కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దళితులు, వెనుకబడిన వారిలాగే బ్రాహ్మణులు కూడా యోగి ప్రభుత్వ దౌర్జన్యాలకు లక్ష్యంగా ఉన్నారు’’ అని సమాజ్ వాదీ పార్టీ ట్వీట్ చేసింది.
