Fourth Covid Wave? 24 గంటల్లో 17వేలకు పైగా కొత్త కేసులు.. 29 మంది మృతి
మన దేశంలో కరోనా కేసులు మళ్లీ మెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 17,092 కేసులు నమోదైనట్టు ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజు కంటే కొత్త కేసులు రెండు వేలకుపైగా రిపోర్ట్ కావడం గమనార్హం. కొత్త కేసుల పెరుగుదల నాలుగో కరోనా వేవ్పై భయాలు కలిగిస్తున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మెల్ల మెల్లగా మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించిన బులెటిన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కొత్త కేసులు 17,092 రిపోర్ట్ అయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారిన పడిన 29 మంది మరణించారు. దీంతో దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 17,092 కేసులు కొత్తగా నమోదవ్వగా.. 14,684 మంది కరోనా పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారు. దీనితో రికవరీ రేటు ప్రస్తుతం 98.54 వద్ద ఉన్నది. మొత్తం రికవరీల సంఖ్య ,428,51,590కు చేరింది.
కొత్త కేసుల పెరుగుదలతో కరోనా వైరస్ నాలుగో వేవ్ భయాలు నెలకొంటున్నాయి. కేవలం రోజు వ్యవధిలోనే కొత్త కేసుల్లో 2,379 పెరుగుదల కనిపించింది. తొలుత కేసులు ఇలాగే.. వంద, వేయిల స్థాయిలో పెరుగుదల కనిపించినా.. పరాకాష్టకు వెళ్లాక రోజు వ్యవధిలో లక్ష కేసుల పెరుగదలనూ మనం చూశాం. ఈ నేపథ్యంలోనే 24 గంటల్లో కరోనా కొత్త కేసుల పెరుగుదల రెండు వేలను దాటడం కొంత ఆందోళన కలిగిస్తున్నది.
ఇదిలా ఉండగా, దేశంలో అత్యధిక కేసులు రిపోర్ట్ చేస్తున్న రాష్ట్రాలుగా ఫస్ట్ కేసు రిపోర్ట్ చేసిన కేరళ, ఆ తర్వాత మహారాష్ట్రలు ఉన్నాయి. గత 24 గంటల కాలంలో కేరళలో 3,904 కేసులు కొత్తగా నమోదయ్యాయి. కాగా, మహారాష్ట్రలో 3,249 కేసులు, తమిళనాడులో 2,385, పశ్చిమ బెంగాల్లో 1,739 కేసులు, కర్ణాటకలో 1,073 కేసులు రిపోర్ట్ అయ్యాయి. కొత్త కేసుల్లో కేవలం ఒక్క కేరళ రాష్ట్రమే 22.84 శాతం వాటా కలిగి ఉండటం గమనార్హం. గత వేవ్లలోనూ అత్యధిక కేసులు కేరళ, మహారాష్ట్రల్లోనే రిపోర్ట్ కావడాన్ని గమనించారు.
కరోనాతో మన దేశంలో తొలి మరణం మార్చి 2020లో చోటుచేసుకుంది. తాజాగా, 29 మరణాలు చోటుచేసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కారణంగా మన దేశంలో మరణించిన పేషెంట్ల సంఖ్య మొత్తం 5,25,168కి చేరింది.