Parliament Monsoon Session 2022: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశమున్నది. దాదాపు నెలరోజుల పాటు సాగే ఈ సమావేశాలు ఆగస్టు 12న ముగియనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
Parliament Monsoon Session 2022: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దాదాపు నెలరోజుల పాటు సాగనున్న ఈ సమావేశాలు జూలై 18 నుంచి ఆగస్టు 12 మధ్య జరుగనున్నాయి. ఈ మేరకు రక్షణ మంత్రి, లోక్సభలో బీజేపీ ఉపనేత రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫార్సు చేసిందని ఉన్నత వర్గాల సమాచారం.
రాబోయే Parliament Monsoon Session సెషన్కు 17 పని దినాలు ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. భారత ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలను ప్రకటించగా, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నది. రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరుగనున్నది. ఈ ఎన్నికల ఫలితాలు జూలై 21న వెల్లడికానున్నాయి.
ఇక, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది. దీంతో ఈసారి రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్, ఉపరాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా లోక్సభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు. రెండు రాజ్యాంగ పదవులకు సంబంధించిన కౌంటింగ్ కూడా పార్లమెంటు సమావేశాల్లోనే జరగనుంది. వర్షాకాల సెషన్ సాధారణంగా జూలై మూడో వారంలో ప్రారంభమై ఆగస్టు రెండో వారంలో ముగుస్తుంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గందరగోళం!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రసాభాసగా సాగనున్నాయని పలువురు భావిస్తున్నారు. రాహుల్, సోనియాలపై ED చర్య, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులకు సంబంధించిన సమస్యలు, సరిహద్దులో చైనాతో ప్రతిష్టంభన, మరికొన్ని సమస్యలపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వర్షాకాల సమావేశంలో ప్రభుత్వాన్ని విమర్శించనున్నది.
గత బడ్జెట్ సెషన్లో పార్లమెంటరీ పరిశీలనకు పంపిన కనీసం 4 బిల్లులతో సహా పలు బిల్లులు ఆమోదం పొందునున్నాయి. అలాగే.. 2022 శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్సభ స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రకటించినందున, ప్రస్తుత పార్లమెంట్ భవనంలో ఇదే చివరి సెషన్ కావచ్చు.
