Indian Citizenship: గత మూడేళ్లలో 3,92,643 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని, అత్యధిక సంఖ్యలో భారతీయులకు అమెరికా పౌరసత్వం ఇచ్చిందని ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు తెలిపింది.

Indian Citizenship: గత కొన్ని సంవత్సరాలుగా మెరుగైన జీవ‌నం, కోరుకున్న ఉద్యోగం, ఆక‌ర్ష‌ణీయ‌మైన జీతం కోసం స్వ‌దేశాన్నివిడిచిపెట్టి..  విదేశాల‌కు వెళ్తున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఈ కోవ‌లో  మ‌న దేశ యువ‌త ముందున్నారు. ఈ  త‌రుణంలో వారు విదేశాల్లోనే సిర్థ నివాసం ఏర్పాచుకుని... మ‌న దేశ‌ పౌరసత్వాన్ని విడిచిపెట్టే ధోరణి కూడా పెరిగింది. గత మూడేళ్లలో 3,92,643 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని, అత్యధిక సంఖ్యలో భారతీయులకు అమెరికా పౌరసత్వం ఇచ్చిందని ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు తెలిపింది.

2021లో ఎంత మంది భారతీయ పౌరులు స్వ‌దేశ పౌరసత్వాన్ని విడిచిపెట్టి, మరే ఇతర దేశ పౌరసత్వాన్ని స్వీకరించారని లోక్‌సభలో హాజీ ఫజ్లుర్ రెహ్మాన్ అడిగిన ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంతో పాటు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మరింత స‌మాచారాన్ని అందించారు. ఈ స‌మాచారం అందరిని షాక్ కు గురి చేసింది. 

కేంద్రం స‌మ‌ర్పించిన‌  డేటా ప్రకారం.. 2019 నుండి 2021 వరకు పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య 3,92,643. ఇందులో 2019లో 1,44,017 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోగా, 2020లో 85,256 మంది భారతీయులు, 2021లో 1,63,370 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.

ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2019 సంవత్సరంలో  ఏ ఒక్క  భారతీయుడు కూడా భారత పౌరసత్వాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్ పౌరసత్వాన్ని స్వీకరించలేదు. కానీ, 2021లో 41 మంది భారతీయులు పాక్ పౌరసత్వం తీసుకున్నారని తెలిపారు. 2019లో ఒక్క భారతీయుడు కూడా పాకిస్థాన్ పౌరసత్వం తీసుకోనప్పటికీ.. 2021లో 41 మంది భారతీయులు పాకిస్థాన్ పౌరసత్వాన్ని స్వీకరించారు. అలాగే.. 2020లో 7 గురు భార‌తీయులు త‌మ పౌర‌స‌త్వాన్ని వ‌దిలి,  పాకిస్థాన్ పౌరసత్వం తీసుకున్నారని తెలిపారు. దీనికి కారణమేంట‌ని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. వ్యక్తిగత కారణాల వల్ల పౌరసత్వాన్ని విడిచిపెట్టారని ప్రభుత్వం తెలిపింది.

భారతీయుల ఎంపికలో ఈ దేశాలు ముందున్నాయి

భారతదేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలలో స్థిరపడేందుకు భారతీయులు మొద‌ట‌ అమెరికాకు ప్రాధ్యాన‌త ఇస్తున్నార‌ని, ఆ త‌రువాత‌ ఆస్ట్రేలియాకు ప్రాధ్యాన‌త ఇస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. ఆ త‌రువాత స్థానంలో కెనడా, బ్రిటన్ లు ఉన్నాయి.

గ‌త మూడేండ్ల‌లో (2019- 2021) 1,70,795 భారతీయులకు US పౌరసత్వం ఇచ్చింది. ఇందులో అమెరికా 2019లో 61,683 మంది భారతీయులకు, 2020లో 30,828 మంది భారతీయులకు, 2021లో 78,284 మంది భారతీయులకు పౌరసత్వం ఇచ్చింది.

అలాగే..  గత మూడేళ్లలో ఆస్ట్రేలియాలో 58,391 మంది, కెనడాలో 64,071 మంది, బ్రిటన్‌లో 35,435 మంది , జర్మనీలో 6,690 మంది, ఇటలీలో 12,131 మంది, న్యూజిలాండ్‌లో 8,882 మంది, పాక్‌లో 48 మంది భారతీయులు పౌరసత్వం పొందారని తెలిపింది.