అంబానీ ఇంటి వద్ద కారు కలకలం: కుట్ర మూలాలు తీహార్ జైలులో, వెలుగులోకి ఉగ్రవాది
ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలతో నిండిన కారు వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది.
ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలతో నిండిన కారు వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. అంబానీ ఇంటి వద్ద పార్క్ చేసి వుంచి స్కార్పియో కారు ఓనర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన నాటి నుంచి ఈ కేసులో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇక అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపింది తామే అంటూ జైషే ఉల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థ టెలిగ్రాం వేదికగా ఈ ప్రకటన చేసింది.
అయితే ఈ టెలిగ్రాం మెసేజ్ను ఆధారంగా చేసుకుని అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా.. ఈ కేసు మూలం తీహార్ జైలులో బయటపడింది. ఇక్కడ శిక్ష అనుభవిస్తోన్న ఉగ్రవాదులు కొందరు ఈ టెలిగ్రామ్ గ్రూప్ను క్రియేట్ చేసినట్లు ముంబై పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గురువారం తీహార్ జైలు అధికారులను కలవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇందుకు సంబంధించిన వివరాలను డిప్యూటి కమిషనర్ ప్రమోద్ సింగ్ తెలిపారు. టెలిగ్రాం మెసేజ్ ఆధారంగా ముంబై పోలీసులు ఓ ప్రైవేట్ సైబర్ ఏజెన్సీ సాయంతో లోకేషన్ని ట్రేస్ చేయగా.. తీహార్ జైలు వెలుగులోకి వచ్చిందని చెప్పారు. దాంతో ఢిల్లీ పోలీసులు అక్కడకు చేరుకున్నారని ప్రమోద్ తెలిపారు.
Also Read:అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు
స్పెషల్ సెల్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తీహార్ జైలు అధికారులు సోదాలు నిర్వహించగా.. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తెహిసీన్ అఖ్తర్ సహా అల్ఖైదాతో సంబంధాలున్నవారు, అండర్ వరల్డ్ డాన్లు ఉంటున్న బ్యారక్లో మొబైల్ ఫోన్ ఉన్నట్లు తెలిసిందన్నారు. దీన్ని ఉగ్రవాది అఖ్తర్ నుంచి స్వాధీనం చేసుకోవడంతో ప్రస్తుతం అతడిపైనే అనుమానాలు వున్నట్లు పోలీసులు చెప్పారు.
ఈ క్రమంలో జైలులో కనీసం 11 మంది ఖైదీలను స్పెషల్ సెల్ ప్రశ్నించింది. ఈ మొబైల్ నంబరు వినియోగదారు టెలిగ్రామ్ ఖాతాను సృష్టించడానికి వర్చువల్ నంబర్లను వినియోగించాడు.. అంతేకాకుండా, అనుమానితుడు నెట్లో ఐపీ అడ్రస్ను గుర్తించకుండా ఉండేందుకు టీఓఆర్ బ్రౌజర్ను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ముంబై పోలీసులు నియమించిన సైబర్ నిపుణులు టెలిగ్రామ్ ఛానల్ గురించి సమాచారం పొందడానికి ట్రోజన్లను ఉపయోగించారు. ఇది ఫిబ్రవరి 26 మధ్యాహ్నం ఈ టెలిగ్రాం గ్రూప్ను క్రియేట్ చేసినట్టు కనుగొన్నారు.
అంబానీ నివాసం వెలుపల వాహనాన్ని నిలిపి ఉంచిన ఘటనకు బాధ్యత వహిస్తూ ఈ ఉగ్రవాద గ్రూపు ఫిబ్రవరి 27న టెలిగ్రామ్లో మెసేజ్ పోస్ట్ చేసింది. కానీ ముంబై పోలీసులు దీన్ని నకిలీదిగా కొట్టి పారేశారు.
ఇక తెహిసీన్ అఖ్తర్ 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ సందర్భంగా పాట్నాలో వరుస పేలుళ్లకు ప్లాన్ చేశాడు. ఈ కేసుకకు సంబంధించి ఇతడిని అరెస్ట్ చేశారు. అయితే అఖ్తర్కు గతంలో హైదరాబాద్, బోధ్గయాలో జరిగిన పేలుళ్లతో కూడా సంబంధం ఉంది.