కాంగ్రెస్ ఎన్నికల హామీ... విద్యార్థులకు ఉచిత లాప్ ట్యాప్
పదో తరగతి పాస్ అయితే చాలు.. వారికి ఉచితంగా ల్యాప్ టాప్ లు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
దేశంలో ఎన్నికల హడావిడి మొదలౌతోంది. ఇప్పటికే తెలంగాణ సహా.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మొదలైంది. ప్రజలను ఆకట్టుకొని.. తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు రాజకీయ నాయకులు తెగ పాట్లుపడుతున్నారు. ఇందులో భాగంగానే.. ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు.
కాగా.. పదో తరగతి పాస్ అయితే చాలు.. వారికి ఉచితంగా ల్యాప్ టాప్ లు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాకపోతే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులేండి. మిజోరాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు ఈ నియమాన్ని తమ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది.
అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు థన్ హావ్లా పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్ లు అందిస్తామని ప్రకటించారు. ఇల్లు లేని నిరుపేదలతోపాటు పోలీసు, విద్యాశాఖ ఉద్యోగులకు నివాసగృహాలు నిర్మించి ఇస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది.