నోబెల్ గ్రహీత మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థకు వచ్చే విదేశీ నిధుల లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేసింది. ఈ మేర‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ‌నివారం వెళ్ల‌డించింది. 

నోబెల్ గ్రహీత మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థకు వచ్చే విదేశీ నిధుల లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేసింది. ఈ మేర‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ‌నివారం వెళ్ల‌డించింది. దీంతో ఇకు నుంచి ఆ సంస్థ‌కు విదేశాల నుంచి విరాళాలు రానున్నాయి. రెండు వారాల కింద‌ట ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) రిజిస్ట్రేషన్‌ను రెన్యువ‌ల్ చేయ‌డానికి కేంద్ర ప్రభుత్వం నిరాక‌రించింది. అయితే కొత్తగా ఈ కొత్త లైసెన్స్ 2026 చివరి వరకు చెల్లుబాటు కానుంది. 

గ‌తేడాది డిసెంబ‌ర్ 25న తిర‌స్క‌ర‌ణ‌
భార‌తదేశంలో ఉన్న ఎన్జీవోలు, ఇత‌ర సంస్థ‌లు విదేశాల నుంచి విరాళాలు స్వీక‌రించాలంటే కేంద్ర హోం వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ వారు అందించే లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అయితే దీని గ‌డువు ముగిసిన త‌ర్వాత దీనిని రెన్యువ‌ల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లైసెన్స్ రెన్యువ‌ల్ కోసం కేంద్రం అడిగిన అన్ని ర‌కాల ప‌త్రాలు, స‌మాచారం ఆయా సంస్థ‌లు అందించాల్సి ఉంటుంది. అయితే స‌రైన స‌మాచారం అందించ‌నందున లైసెన్స్ ను రెన్యువ‌ల్ చేయ‌లేదు. “కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA), ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రూల్స్ (FCRR) 2011 ప్రకారం నిబంధనలు, పాటించనందుకు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఫారిన్ సంస్థ లైసెన్స్ 2021 డిసెంబర్ 25వ తేదీన తిరస్కరించాం’’ అని మినిస్ట్రీ హోం అఫైర్స్ ప్రకటించింది. అయితే ఆ ఛారిటీ FCRA రిజిస్ట్రేషన్ డిసెంబర్ 31, 2021 వరకు చెల్లుబాటు అవుతుందని తెలిపింది. 

దీనిపై అనేక రాజకీయ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్ ను రెన్యువల్ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న లైసెన్స్ జనవరి 1, 2022 నుండి డిసెంబర్ 31, 2026 వరకు చెల్లుబాటు అవుతుందని తెలిపింది. ఈ విషయంలో మిష‌న‌రీ ఆఫ్ ఛారీటీ అధికార ప్ర‌తినిధి సునీతా కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం త‌మ FCRA రిజిస్ట్రేషన్‌ను గుర్తించి రెన్యువ‌ల్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని తెలిపారు. తమ సంస్థ పేద‌ల కోసం పని చేస్తుంద‌ని విదేశీ దాత‌లకందరికీ తెలుస‌ని చెప్పారు. అయితే అంత‌కు ముందు కూడా త‌మ లైసెన్స్ ర‌ద్దు చేయ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. అలాగే సంస్థ బ్యాంక్ అకౌంట్‌లను ఫ్రీజ్ చేయాల‌ని కూడా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించ‌లేద‌ని తెలిపారు. అయితే లైసెన్స్ రెన్యువ‌ల్ ప్ర‌క్రియ ఆమోదం కాలేద‌ని త‌మ‌కు స‌మాచారం అందింద‌ని చెప్పారు. దీంతో స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేంత వ‌ర‌కు ఎఫ్‌సీ ఖాతాల్లో లావాదేవీలు జ‌ర‌ప‌వ‌ద్ద‌ని త‌మ కేంద్రాల‌కు సూచించామ‌ని అన్నారు. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థకు చెందిన అన్ని బ్యాంకులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్తంభింపజేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించిన నేపథ్యంలో ఈ వివ‌ర‌ణ ఇచ్చారు. 

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి కూడా FCRA లైసెన్స్ ఏడాది నుంచి రెన్యువ‌ల్ కు నోచుకోకుండా ఉంది. దీంతో ఆ దేవ‌స్థానికి రావాల్సిన రూ.50 కోట్లు ఏడాది నుంచి నిలిచిపోయాయి. ఈ విష‌యంలో టీటీడీ అధికారులు ప‌లు మార్లు ఢిల్లీకి వెళ్లివ‌చ్చారు.