ఓ ఐదుగురు దుండగులు... బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కిడ్నాప్ చేశారు. నిందితుల్లో ఒకరికి చెందిన దుకాణానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారు. ఆ తరువాత అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తన ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. 

లక్నో : ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ 14 యేళ్ల మైనర్ బాలికను ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తరువాత ఆమె నోట్లో గుడ్డలు కుక్కి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘ఆదివారం రాత్రి బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇంటి వరండాలో పడుకున్నారు. 

ఇది గమనించిన రాంపూర్ లోని ఓ ఐదుగురు దుండగులు... బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కిడ్నాప్ చేశారు. నిందితుల్లో ఒకరికి చెందిన దుకాణానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారు. ఆ తరువాత అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తన ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. కాగా స్పృహలోకి వచ్చిన తరువాత బాలిక కుటుంబ సభ్యులకు జరిగిన ఘోరాన్ని తెలిపింది’ అన్నారు. 

ఇక ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మొత్తం ఐదుగురు నిందితులమీద కేసే నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరితో బాలికకు స్నేహం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు వెల్లడించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. 

బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు రాంపూర్ ఎస్పీ అంకిత్ కుమార్ తెలిపారు. అయితే ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్థారణ కాలేదని అన్నారు. అయితే, కేసు తీవ్రత, చేస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఆయన చెప్పారు.