ఓ మైనర్ బాలుడు మహిళతో హేళనగా ప్రవర్తించాడు. ఎందుకలా చేశావని అడిగిన ఆమె భర్తను హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది.
తమిళనాడు : తన భార్యను ఎందుకు హేళన చేశావని అడిగినందుకు ఓ వ్యక్తిని మైనర్ బాలుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా విరుదాచలంలో జరిగింది. హత్యకు పాల్పడిన మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు విజయ్ కుమార్ మణలూరు కాలనీ నివాసి. ఇటుక బట్టీలో కూలీగా పని చేస్తాడు. ఆయన భార్య చిత్ర(30), అతనికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఆదివారం సాయంత్రం విజయ్ కుమార్ భార్య చిత్ర సరుకులు కొనుగోలు చేసేందుకు తమ ఇంటి దగ్గరలో ఉండే కిరాణా దుకాణానికి వెళ్ళింది. ఈ సమయంలో అదే ప్రాంతంలో ఉండే 17 ఏళ్ల బాలుడు చిత్రను హేళన చేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన చిత్ర ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. వెంటనే విజయ్ కుమార్ బాలుడి దగ్గరికి వెళ్లి అతడిని ఎందుకు హేళన చేశావంటూ మందలించాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది.
వామ్మో.. దేశంలో 40 వేలు దాటిన యాక్టివ్ కరోనా కేసులు.. కొత్తగా 7,830 కోవిడ్ కేసులు నమోదు..
ఈ వాగ్వాదం కారణంగా బాలుడు తీవ్రకోపావేశాలకు లోనై.. ఇంటికి వెళ్లి కత్తి తీసుకువచ్చి విజయ్ కుమార్ మీద దాడి చేశాడు. ఈ దాడిలో విజయకుమార్ తీవ్రంగా గాయపడి.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సమాచారం అందడంతో పోలీసులు పుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడైన బాలుడిని అరెస్టు చేశారు. దీనిమీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఆదివారం వెలుగు చూసిన వృద్ధ దంపతుల హత్యకు సంబంధించి వారి కోడలే నిందితురాలిగా పోలీసులు తేల్చారు. ఆమె మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వారిని హత్య చేసిందని తెలిపారు. 70 ఏళ్ల వయసున్న భార్యభర్తలిద్దరు సీనియర్ సిటిజన్లు ఢిల్లీలోని గోకుల్పురి ప్రాంతంలో హత్యకు గురయ్యారు. గోకుల్ పురిలోని ఓ ఇంట్లో కొడుకు, కోడలుమనవడితో కలిసి వీరు నివసిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, వారి కోడలు మోనికా వీరిని హత్య చేయడానికి ఇద్దరు వ్యక్తుల సహాయం తీసుకుంది. ఆ ఇద్దరిలో ఒకరు ఆమె ప్రియుడు అని పోలీసులు అనుమానిస్తున్నారు. వృద్ధుడు రాధేశ్యామ్ వర్మ, రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్, తన భార్యతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్లో నివసిస్తుండగా, మోనికా, ఆమె భర్త వారి కుమారుడు మొదటి అంతస్తులో ఉంటున్నారు.
హత్య జరిగిన రోజు మోనికా తన బాయ్ఫ్రెండ్, మరొక వ్యక్తిని ఇంటి టెర్రస్పైకి తీసుకువెళ్లింది. అక్కడ వారు చీకటి పడేవరకు దాక్కున్నారు. ఆ తరువాత అంతా సద్దుమణిగిన తరువాత వృద్ధ దంపతుల బెడ్రూమ్లోకి ప్రవేశించి వారి గొంతు కోసి చంపారని పోలీసులు తెలిపారు.
హత్యలకు సంబంధించిన సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించి, తదుపరి విచారణ జరుపుతున్నారు. హత్యల వెనుక ఉద్దేశ్యం ఆస్తికి సంబంధించిన వివాదమేనని భావిస్తున్నారు, ఇంటిని అమ్మకానికి పెట్టారని.. అడ్వాన్స్ లో భాగంగా ఇచ్చిన రూ. 4 లక్షల నగదు కూడా దంపతుల హత్య తరువాత కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.
