మీ టూ ఉద్యమం.. కేంద్ర మంత్రిపై ఆరోపణలు
తనను కేంద్ర మంత్రి , మాజీ ఎడిటర్ ఎంజే అక్బర్ లైంగికంగా వేధించాడంటూ మహిళా జర్నలిస్టు ప్రియ రమణి ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా మీ టూ ఉద్యమం గురించే చర్చ జరుగుతోంది. లైంగిక వేధింపులకు గురైన మహిళలంతా ఒక్కొక్కరిగా ఈ మీటూ ఉద్యమంలో చేతులు కలుపుతున్నారు. కొంతకాలం క్రితం ఈ మీ టూ ఉద్యమం హాలీవుడ్ లో ప్రారంభంకాగా.. తాజాగా బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఆరోపణలతో మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఇప్పటివరకు సినీ నటులు మాత్రమే ఈ మీ టూ ఉద్యమం గురించి చర్చించగా.. ఇప్పుడు జర్నలిస్టులు కూడా ఈ ఉద్యమంలో చేతులు కలిపారు. తనను కేంద్ర మంత్రి , మాజీ ఎడిటర్ ఎంజే అక్బర్ లైంగికంగా వేధించాడంటూ మహిళా జర్నలిస్టు ప్రియ రమణి ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది.
కాగా.. ఎంజే అక్బర్ పై వచ్చిన ఆరోపణలు మరో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ని వెంటాడాయి. ఈ విషయంలో సమాధానం చెప్పాలంటూ కొందరు మీడియా ప్రతినిధులు మంత్రి సుష్మాస్వారజ్ ని ప్రశ్నించారు.
‘‘ మంత్రి పై వచ్చినవి చాలా సీరియస్ ఆరోపణలు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు. ఓ మహిళా మంత్రిగా వీటిపై మీ స్పందన ఏంటి..?’’ అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. వాటిని సమాధానం చెప్పకుండానే సుష్మాస్వారాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.