#మీటూ ఎఫెక్ట్:కేంద్రమంత్రి రాజీనామాకు కాంగ్రెస్ పట్టు
#మీటూ సెగ కేంద్రమంత్రి ఎంజే అక్బర్ కు తగిలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఢిల్లీ: #మీటూ సెగ కేంద్రమంత్రి ఎంజే అక్బర్ కు తగిలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఎంజే అక్బర్ తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సమాధానం చెప్పని పక్షంలో రాజీనామా చెయ్యాలని కోరారు. కేంద్ర మంత్రి వేధింపులపై దర్యాప్తు జరిపించాలని జైపాల్ రెడ్డి సూచించారు.
మరోవైపు లైంగిక ఆరోపణలపై మౌనం ఎంత మాత్రం సమాధానం కాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. సమస్య తీవ్రతను బట్టి మంత్రి నోరు విప్పాలని, మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి సమాధానంతో పాటు ప్రధాని మోదీ ఏం చెబుతారో తెలుసుకోవాలనుకుంటున్నామని తివారీ పేర్కొన్నారు.
అటు కేంద్రమంత్రి ఎంజే అక్బర్ పై వచ్చిన ఆరోపణలపై బీజేపీ ఇంతవరకూ పెదవి విప్పలేదు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సైతం ఇదే అంశంపై మహిళా జర్నలిస్టుల ప్రశ్నలకు మౌనాన్నే సమాధానంగా ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.