యుపీలో వంద సీట్లకు పోటీ చేస్తాం: అసదుద్దీన్ ఓవైసీ వెల్లడి
వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము వంద సీట్లకు పోటీ చేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఎంఐఎంతో బిఎస్పీ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలను మాయావతి ఖండించారు.
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శానససభ ఎన్నికల్లో తమ పార్టీ వంద సీట్లకు పోటీ చేస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. వచ్చే ఏడాది యూపీ శాసనసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిదే. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్లు ఓవైసీ తెలిపారు.
సహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేతృత్వంలోని ఓం ప్రకాశ్ రాజభర్ కు చెందిన సంకల్ప్ మోర్చా కూటమిలో తాము భాగస్వాములుగా ఉన్నట్లు ఆయన చెప్పారు. తాము యుపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లకు పోటీ చేస్తున్నామని, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని, అందుకు అభ్యర్థి దరఖాస్తు ఫారాన్ని విడుదలు చేశామని ఆయన చెప్పారు.
సంకల్ప్ మోర్చా కూటమిలో తాము భాగస్వాములమని, ఏ ఇతర పార్టీలతోనూ తాము సంప్రదింపులు జరపలేదని ఆయన చెప్పారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో ఎంఐఎం పొత్తు పెట్టుకుంటుందని తొలుత వార్తలు వచ్చాయి.
తాము యూపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని బిఎస్పీ అధినేత మాయావతి ప్రకటించారు. ఎంఐఎంతో కలిసి బిఎస్పీ పోటీ చేస్తుందని ఓ న్యూస్ చానెల్ లో వార్త ప్రసారమైంది. ఆ వార్త పచ్చి అబద్ధమని, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని మాయావతి ఆదివారంనాడు స్పష్టం చేశారు.