అయోధ్య చరిత్రలో బాబ్రీ ఉండి తీరుతుంది: అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అయోధ్యలో రామమందిరానికి ప్రధాని నరేంద్రమోడీ బుధవారం భూమిపూజ చేశారు. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు
అయోధ్యలో రామమందిరానికి ప్రధాని నరేంద్రమోడీ బుధవారం భూమిపూజ చేశారు. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎన్నటికీ తుడిచిపెట్టుకుపోదని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేసిన అసదుద్దీన్.. ‘‘ బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, ఖచ్చితంగా ఉంటుంది కూడా ’’ అని వ్యాఖ్యానించారు.
Also Read:రామ మందిర నిర్మాణం దేశాన్ని ఏకం చేసేందుకు ఓ సాధనం: మోడీ
ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ ప్రధాని రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ అసదుద్దీన్ గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ఓ క్రిమినల్స్ గుంపు ధ్వంసం చేశారని ఒవైసీ అన్నారు.
వివాదాస్సద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పటికీ తాను బతికున్నంత కాలం బాబ్రీ మసీదు ఎపిసోడ్ ముగిసిపోదని హెచ్చరించారు. రామమందిర భూమి పూజను ప్రధాని నిర్వహించకూడదని అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు.
Also Read:500 ఏళ్ల పాటు జరిగిన సంఘర్షణ ఫలితమే రామ మందిర నిర్మాణం: యోగి ఆదిత్యనాథ్
కాగా అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు గతేడాది నవంబర్లో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందన్న సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డ్కు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది.
ఈ క్రమంలోనే అయోధ్య నుంచి 18 కిలోమీటర్ల దూరంలో లక్నో హైవే సమీపంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది.