Army Chopper Crash: సేఫ్టీలో మేటి Mi-17V-5 హెలిక్యాప్టర్లు..
త్రివిధ దళాల అధిపతి ప్రయాణిస్తున్న హెలిక్యాపర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన వల్ల దేశం మొత్తం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. అయితే వారు ప్రయాణిస్తున్న హెలిక్యాపర్ అత్యంత సురక్షితమైనవని మాజీ ఆర్మీ అధికారులు తెలుపుతున్నారు.
తమిళనాడులో కూనూరు ఆటవీ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీకి చెందిన హెలిక్యాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న హెలీక్యాప్టర్ ఒక్క సారిగా కుప్పకూలింది. ఇందులో త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి, కుంటుంబ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. ఇందులో బిపిన్ రావత్ మృతి చెందినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ప్రమాదం వల్ల దేశం మొత్తం ఒక్క సారిగా ఉలిక్కిపాటుకు గురైంది.
అత్యంత సురక్షితమైన Mi-17V-5 హెలిక్యాప్టర్..
త్రివిధ దళాల అధిపతి ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ లో మొత్తం 14 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ప్రమాదం జరిగిందా ? లేదా మరే ఇతర కారణం వల్ల ప్రమాదం జరిగిందా ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనై భారత వైమానిక దళం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. అయితే బిపిన్ రావత్, ఆయన కుటుంబం ప్రయాణించిన హెలిక్యాప్టర్ అత్యంత సురక్షితమైనవని మాజీ ఆర్మీ అధికారులు తెలుపుతున్నారు. Mi-17V-5 రకానికి చెందిన హెలిక్యాప్టర్ ఆర్మీ అవసరాల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినవి. ఇవి అత్యంత పొడవైన చెట్లపై, పర్వతాలపై కూడా ప్రయాణం చేయగలవు. అత్యంత శక్తివంతమైనవి కూడా. ఈ హెలిక్యాప్టర్కు శక్తివంతమైన రెండు ఇంజన్లు ఉంటాయి. ఇందులో 4 వేల పేలోడ్ సామర్థ్యాన్ని సులువుగా తీసుకెళ్లవచ్చు. ప్రపంచంలోనే అత్యాధునిక సదుపాయలన్నీ ఈ హెలీక్యాప్టర్ లో ఉంటాయి. దీనిని ఆర్మీకి సంబంధించిన ఆయుధాలను రవాణా చేయడానికి చేయడానికి, కాన్వాయ్ ఎస్కార్ట్, పెట్రోలింగ్, సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లలో దీనిని ఉపయోగిస్తారు. అత్యధిక ఎత్తులో కూడా ఎగురగలిగే ఈ హెలీక్యాపర్ట్లను ప్రధాని, ఇతర వీఐపీల ప్రయాణానికి ఉపయోగిస్తారు.
Mi-8/17 హెలికాప్టర్ ల సిరీస్ కు చెందిన ఈ హెలీక్యాప్టర్లను రష్యన్ కు చెందిన కజాన్ హెలిక్యాపర్ట్స్ అనే సంస్థ ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం భారత వాయు సేన వద్ద 151 ఇలాంటి హెలీక్యాప్టర్ లు ఉన్నాయి. ఇంతటి అత్యాధునిక శక్తివంతమైన సదుపాయాలు ఉన్న హెలీక్యాప్టర్కు ప్రమాదం జరగడం పట్ల అన్ని వర్గాల నుంచి ధ్రిగ్బాంతి వ్యక్తం అవుతోంది. ఈ ఘటనను రక్షణశాఖ మంత్రి ప్రధానికి వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై పార్లమెంట్లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.