ఆస్ట్రేలియాలో మరో హిందూ దేవాలయంపై దాడి.. వారంలోనే రెండో ఘటన
Melbourne: ఆస్ట్రేలియాలో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. విక్టోరియాలోని కారమ్ డౌన్స్ లో ఉన్న చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు ఆలయాన్ని ఖలిస్తాని మద్దతుదారులు ధ్వంసం చేసినట్లు ఆస్ట్రేలియా మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.
Hindu temple vandalised in Australia: ఆస్ట్రేలియాలో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. విక్టోరియాలోని కారమ్ డౌన్స్ లో ఉన్న చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు ఆలయాన్ని ఖలిస్తాని మద్దతుదారులు ధ్వంసం చేసినట్లు ఆస్ట్రేలియా మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఒక వారంలో ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలపై జరిగిన రెండో దాడి ఇది. దీంతో అక్కడి ఆలయాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
వివరాల్లోకెళ్తే.. ఖలిస్తానీ మద్దతుదారులు భారత్ వ్యతిరేక గ్రాఫిటీతో ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారనీ, వారం రోజుల వ్యవధిలో విక్టోరియా రాష్ట్రంలోని ఓ ఆలయంపై జరిగిన రెండో దాడి ఇది. విక్టోరియాలోని కారమ్ డౌన్స్ లో ఉన్న చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఆస్ట్రేలియా టుడే వెబ్ సైట్ తెలిపింది. తమిళ హిందూ సమాజం మూడు రోజుల పాటు 'థాయ్ పొంగల్' పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో భక్తులు దర్శనం కోసం వచ్చినప్పుడు ఈ విధ్వంసాన్ని గమనించారు. తమది ఆస్ట్రేలియాలోని తమిళ మైనారిటీ సమూహమనీ, మతపరమైన హింస నుంచి తప్పించుకోవడానికి మాలో చాలా మంది శరణార్థులుగా వచ్చారని శ్రీ శివవిష్ణు ఆలయ భక్తురాలు ఉషా సెంథిల్ నాథన్ తెలిపినట్టు ఆస్ట్రేలియన్ మీడియా పేర్కొంది. ఇది తమ ప్రార్థనా స్థలం అనీ, ఈ ఖలిస్తాన్ మద్దతుదారులు ఎలాంటి భయం లేకుండా తమ విద్వేష సందేశాలతో దీన్ని ధ్వంసం చేయడం తనకు ఆమోదయోగ్యం కాదని ఆమె అన్నారు.
హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా విక్టోరియా చాప్టర్ అధ్యక్షుడు మక్రాంద్ భగవత్ ఆస్ట్రేలియా టుడేతో మాట్లాడుతూ.. "ఖలిస్తాన్ ప్రచారం కోసం రెండవ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసినందుకు నేను ఎంత కలత చెందానో నేను మీకు మాటల్లో చెప్పలేను" అని అన్నారు. మన దేవాలయాల విధ్వంసం శోచనీయమనీ, దీనిని విస్తృత సమాజం సహించదన్నారు. ఈ ఖలిస్తాన్ మద్దతుదారులకు ధైర్యం ఉంటే శాంతియుత హిందూ సమాజాల మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోకుండా విక్టోరియా పార్లమెంటు భవనంపై గ్రాఫిటీ గీయాలని మెల్బోర్న్ హిందూ కమ్యూనిటీ సభ్యుడు సచిన్ మహతే అన్నారు. విక్టోరియన్ లిబరల్ పార్టీ ఎంపీ బ్రాడ్ బాటిన్ మాట్లాడుతూ.. ఇంతకాలం కలిసి పనిచేయడం ద్వారా మన భవిష్యత్తును ద్వేషంపై నిర్మించలేమని అన్నారు. విక్టోరియాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఇలాంటి ప్రవర్తనకు చోటు లేదని అన్నారు. "ప్రజలు ఒకరికొకరు వ్యతిరేకంగా కాకుండా కలిసి పనిచేయడం నేర్చుకున్నంత కాలం విక్టోరియా ప్రపంచంలోనే ఉత్తమ బహుళ సాంస్కృతిక రాష్ట్రంగా ఉంటుంది" అని బాటిన్ అన్నారు.
ఈ నెల 12న కూడా హిందూ దేవాలయంపై దాడి..
జనవరి 12న మెల్బోర్న్ లోని స్వామినారాయణ్ ఆలయాన్ని 'సంఘ విద్రోహ శక్తులు' భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేశాయి. ఖలిస్తాని మద్దతు దారులు ఈ దాడికి పాల్పడినట్టు అక్కడి గ్రాఫిటీ ద్వారా తెలుస్తోంది. బీఏపీఎస్ స్వామినారాయణ్ సంస్థ ఆస్ట్రేలియా శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటనలో ఈ ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. 'ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లోని మిల్ పార్కులో ఉన్న బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ మందిర్ గేట్ల వద్ద సంఘ విద్రోహ శక్తులు భారత వ్యతిరేక గ్రాఫిటీని ప్రదర్శించడం మాకు చాలా బాధ కలిగించింది. మిల్ పార్క్ లోని బిఎపిఎస్ ఆలయం, ప్రపంచవ్యాప్తంగా బిఎపిఎస్ అన్ని దేవాలయాల మాదిరిగానే, శాంతి, సామరస్యం, సమానత్వం, నిస్వార్థ సేవ-సార్వత్రిక హిందూ విలువలకు నిలయం" అని ప్రకటనలో తెలిపారు.