Karnataka hijab row: కర్నాటకలోని పలు విద్యాసంస్థల్లో రాజుకున్న హిజాబ్ వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో లబ్ది పొందేందుకే హిజాబ్, గుంగాట్ అంశాలను లేవదీస్తున్నదని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
Karnataka hijab row: కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు సైతం పాకుతున్నది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నది. ఈ వివాదం కోర్టుల వరకు చేరింది. సర్వత్రా హిజాబ్ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో బీజేపీ నేతల్లో పలువురు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పిపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేత మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో లబ్ది పొందేందుకే హిజాబ్, గుంగాట్ అంశాలను లేవదీస్తున్నదని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడంపై వివాదం నెలకొన్నది. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్నాటకలో అయితే, పలు కాలేజీలు, పాఠశాలలు మూత పడ్డాయి. కోర్టులో ఇదే అంశంపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ స్పందించారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా పర్యటనలో మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ ప్రజలను విభజించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. నేటి పరిస్థితులు దానికి సాక్షంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. హిజాబ్ లేదా గుంగాట్ సంప్రదాయంలో ఒక భాగమని ఆమె (Mehbooba Mufti) అన్నారు. ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ హిజాబ్ లేదా గుంగాట్ అంశాలను లేవదీస్తున్నదని ఆరోపించారు.
ముఫ్తీ మీడియాతో మాట్లాడుతూ, "ఎన్నికలలో ప్రయోజనాలను పొందేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేటి పరిస్థితిని పోలరైజ్ చేయాలనుకుంటోంది. ఇది ముస్లిం బాలికలను చదువుకు దూరం చేయడానికి కుట్రగా కనిపిస్తోంది" అని అన్నారు. విద్యార్థులు డిమోటివేషన్కు గురికావద్దని, ఈ విషయంలో భారతదేశ నాయకులు ఒక వైఖరిని తీసుకోవాలని ఆమె అన్నారు. భారత్ కు స్వతంత్య్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన గాంధీ చంపిన వారిని బీజేపీ ప్రశంసిస్తోందనీ, గాడ్సే భారత్ గా మార్చడానికి కుట్ర జరుపుతున్నారని ఆరోపించారు. ప్రతిఒక్కరీ జీవితాలను మరింత కష్టతరం చేసే విధంగా బీజేపీ ముందుకు సాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రయోజనాలను పొందడం, ముస్లిం బాలికలను విద్యకు దూరం చేయడం వంటి రెండు కుట్రలు హిజాబ్ వరుసలో ఉన్నాయని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఇటీవలి డీలిమిటేషన్ కమిషన్ ముసాయిదా గురించి మాట్లాడుతూ.. “జమ్మూ డివిజన్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు పీర్ పంచల్ మరియు చీనాబ్ లోయలో కూడా ప్రతిపాదిత డీలిమిటేషన్ పట్ల సంతోషంగా లేరు. జమ్మూ కాశ్మీర్ ప్రజలను విభజించడం, ప్రజల అన్ని హక్కులను హరించడమే కాకుండా ఆ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడం RSS, BJP ల ఎజెండా అని ముఫ్తీ ఆరోపించారు.
కాగా, ముస్లిం బాలికలు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన తర్వాత కొన్ని వారాల క్రితం కర్నాటకలో హిజాబ్ అంశం ఉద్రిక్తలకు దారితీసింది. ఆ తర్వాత రాష్ట్ర పరిపాలన కళాశాలలు, పాఠశాలల్లో మతపరమైన దుస్తులు ధరించరాదని నిబంధనను జారీ చేసింది. ప్రస్తుతం హిజాబ్ వ్యవహారాన్ని కర్నాటక హైకోర్టు విచారణ జరుపుతోంది.
