రైతు నేత రాకేశ్ తికాయత్ అగ్నిపథ్ స్కీంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి ఈ స్కీంకు వ్యతిరేకంగా మెగా ఆందోళన చేపడుతామని వివరించారు. సుమారు వారం పాటు ఈ ఆందోళన ఉంటుందని తెలిపారు. 

లక్నో: భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేశ్ తికాయత్ సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మిలిటరీ రిక్రూట్‌మెంట్ స్కీం అగ్నిపథ్‌ స్కీంకు వ్యతిరేకంగా మెగా ఆందోళన చేపట్టబోతున్నట్టు తెలిపారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా మెగా ఆందోళన రేపటి (ఆగస్టు 7) నుంచే ప్రారంభం అవుతుందని చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఉత్తరప్రదేశ్‌లో ఓ సభలో రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం ఇంకా మిగిలే ఉన్నదని తెలిపారు. అగ్నిపథ్ స్కీంపై పోరాటం ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నదని వివరించారు.

అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని బీకేయూ జాతీయ స్పోక్స్‌పర్సన్ తెలిపారు. ఈ ఆందోళన సుమారు ఒక వారంపాటు జరుగుతుందని చెప్పారు. ఈ ఆందోళనలకు వ్యవసాయ సాగుదారులు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇటీవలి కాలంలో ఆందోళనలు చేస్తున్న రైతులపై గతంలో పెట్టి కేసులను తవ్వి తీస్తున్నారని ఉత్తరప్రదేశ్ పోలీసులపై ఆయన ఆరోపణలు చేశారు. 

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీజేపీ సభ్యులపై ఉన్న కేసులు అన్నింటిని ఎత్తేశారని రాకేశ్ తికాయత్ అన్నారు. కాబట్టి, వారైనా తమపై కేసులు పెట్టడానికి సిద్దం కావాలి లేదా మనమంతా ఉద్యమానికి సిద్ధం కావాలని వివరించారు. లక్నో, ఢిల్లీలో ఉన్నవారు (ప్రభుత్వ పెద్దలు!) ఈ మాటలు జాగ్రత్తగతా వినాలని కోరారు.

‘మీరు రాజకీయ పార్టీలను బ్రేక్ చేయవచ్చు. రైతు సంఘాల నేతల మధ్య చిచ్చు పెట్టవచ్చు. కానీ, రైతులను తోటి రైతుల నుంచి వేరు చేయలేవు. రైతులు మీకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారు’ అని ఆయన అన్నారు. వీటితోపాటు ఆయన భూ సేకరణ, పవర్ టారిఫ్, చెరుకు బకాయిల పెండింగ్ వంటి కీలక అంశాలను ఆయన గుర్తు చేశారు.