కేరళలో వరకట్నం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికల్ స్టూడెంట్ విస్మయ కేసులో కొల్లాం జిల్లా తీర్పు వెలువరించింది. భర్తే దోషి అని తేల్చిన కోర్టు తాజాగా శిక్ష విధించింది. పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 12.55 లక్షల జరిమానా విధించింది.
తిరువనంతపురం: కేరళ మెడికల్ స్టూడెంట్ విస్మయ ఆత్మహత్య కేసు గతేడాది సంచలనం రేపింది. అదనపు కట్నం ఒత్తిళ్లతో ఆమె కొల్లాం జిల్లాలోని ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో భర్తే దోషిగా తేలాడు. తాజాగా, ఆయనకు కొల్లాం కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో విస్మయ భర్తకు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
అంతేకాదు, విస్మయను ఆత్మహత్యకు ప్రేరేపించినందున ఆమె భర్త భర్త కిరణ్ కుమార్కు ఆరేళ్ల జైలు శిక్ష, వరకట్న వేధింపులకు రెండేళ్లు, వరకట్నం తీసుకున్నందుకు ఆరేళ్లు, వరకట్నం డిమాండ్ చేసినందుకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలను ఏకకాలంలో అమలు జరుగుతాయని కోర్టు తెలిపింది.
అంతేకాదు, రూ. 12.55 లక్షల జరిమానా చెల్లించాలని కిరణ్ కుమార్ను ఆదేశించింది. ఇందులో రూ. 2 లక్షలు విస్మయ తల్లిదండ్రులకు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కేసులో విస్మయ భర్త కిరణ్ కుమార్ ను కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. కట్నం కోసం వేధించి 22 ఏళ్ల విస్మయను భర్తే బలవన్మరణానికి పాల్పడేలా చేశాడని న్యాయస్థానం నిర్ధారించింది.
అసలు ఏం జరిగిందంటే..
ఆయుర్వేద వైద్య విద్యార్థి అయిన విస్మయ చదువు పూర్తికాకముందే 2019 మే 19న తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయిన కిరణ్ కుమార్ కు ఇచ్చి వివాహం జరిపించారు. కట్నంగా 100 కవర్ల బంగారం, ఎకరం భూమి, రూ. 10 లక్షల కారు కూడా ఇచ్చారు. అయితే, కారు నచ్చలేదని తనకు 10 లక్షలు నగదు ఇవ్వాలని కిరణ్ డిమాండ్ చేశాడు. ఇదే విషయమై విస్మయను చిత్రహింసలకు గురి చేసేవాడు.ఈ నేపథ్యంలోనే 2021 జూన్ 20న విస్మయ తన బంధువులకు ఒక whatsapp మెసేజ్ చేసింది.
కట్నం కోసం కిరణ్ తనను వేధిస్తున్నాడని వాపోతూ… అతను కొట్టడంతో శరీరంపై అయిన గాయాలను ఫోటోలు తీసి అందరికీ పంపింది. ఆ మరుసటి రోజే కొల్లాం జిల్లా సస్థం కొట్టాలోని కిరణ్ ఇంట్లో శవమై కనిపించింది. కాగా విస్మయ మృతికి కిరణ్ కారణమని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు సంచలనంగా మారడంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడినట్టు 500 పేజీలకు పైగా అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ చార్జిషీట్లో పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈనెల 17న తీర్పును రిజర్వులో ఉంచింది. సోమవారం కిరణ్ ను దోషిగా తేల్చింది.
కాగా, కోర్టు తీర్పుకు కొన్ని గంటల ముందు విస్మయపై జరిగిన దాడి గురించి తెలిపే ఓ ఆడియో క్లిప్ వెలుగు చూసింది. ఆ ఆడియో క్లిప్... విస్మయకు, ఆమె తండ్రి త్రివిక్రమన్ నాయర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఉంది. అందులో విస్మయ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తాను ఎదుర్కొన్న హింస గురించి తన తండ్రి వద్ద ప్రస్తావించింది. తన భర్త కిరణ్ దాడి చేస్తున్నాడని.. భయంగా ఉందని విస్మయ చెబుతోంది. కిరణ్ తనను దారుణంగా కొడుతున్నాడని, అవమానిస్తున్నాడని, ఏడుస్తూ తన తండ్రికి చెప్పింది. ఇక కిరణ్తో కలిసి బతకలేనని, ఈ వేధింపులు భరించలేనని తెలిపారు. తనను కిరణ్ ఇంట్లో నుంచి తీసుకెళ్లాలని తండ్రిని కోరింది. చాలా భయంగా ఉందని తెలిపింది.
