యూపీలో వైద్య విద్యార్థిని మృతి: పోలీసుల అదుపులో డాక్టర్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీకి చెందిన వైద్య విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీకి చెందిన వైద్య విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
వైద్య విద్యార్ధిని తాను చదువుకొనే కాలేజీకి సమీపంలోనే శవంగా బుధవారం నాడు ఉదయం కన్పించింది. మృతురాలిని వేధించినట్టుగా బాధితురాలి కుటుంబం చేసిన ఆరోపణలతో ఓ డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. లక్నోకు సమీపంలోని జలాన్ పట్టణంలో ఆ డాక్టర్ పనిచేస్తున్నారు.
ఆగ్రాలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్ధిని మంగళవారం నుండి కన్పించకుండాపోయింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య విద్యార్ధిని కిడ్నాప్ కు గురైందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఆమె మృతదేహం లభ్యమైంది.
జలాన్ సిటీకి చెందిన ఓ డాక్టర్ వేధిస్తున్నాడని, బెదిరింపులకు దిగాడని కూడ మృతురాలు తమకు చెప్పిందని వైద్య విద్యార్ధిని కుటుంబసభ్యులు ఆరోపించారు.వైద్య విద్యార్ధిని మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పంపారు. వైద్య విద్యార్ధిని మెడ, తలపై గాయాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
దుండగులతో బాధితురాలు పెనుగులాట సమయంలో ఈ గాయాలైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో సీసీటీవీ పుటేజీని స్వాధీనం చేసుకొని పరిశీలించనున్నట్టుగా పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో కొన్ని వారాలుగా మహిళలపై చోటు చేసుకొంటున్న ఘటనలపై విపక్షాలు యోగి సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.మహిళలకు సెక్యూరిటీని కల్పించడంలో యోగి సర్కార్ వైఫల్యం చెందిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫేస్ బుక్ వేదికగా విమర్శలు చేశారు.