లెక్కల మాస్టార్ ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు.. అసలేం జరిగిందంటే..?
ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వేశాడని.. లెక్కల మాస్టార్ తో పాటు గుమాస్తాను చెట్టుకు కట్టేసి విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటన జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగింది. కానీ,స్కూల్ యాజమాన్యం మాత్రం ఫిర్యాదు ఇవ్వడానికి నిరాకరించింది.
గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవేనమః'అంటూ సనాతన భారతీయ సంస్కృతి గురువును త్రిమూర్తులతో పోల్చారు. అంతేకాదు..తల్లిదండ్రుల తర్వాత స్థానాన్నిగురువు కట్టబెట్టింది. ప్రతి వ్యక్తికీ తల్లే ఆది గురువు.. మంచి చెడుల విచక్షణ మాత్రం తెలియజేసేది గురువు. ఇలాంటి పవిత్రమైన వృత్తిలో కొనసాగుతున్న వారిపై సమాజంలో చిన్న చూపు. యువత అత్యంత ప్రభావితం చేసే.. సినిమాల్లోనూ గురువును ఓ జోకరుల్లా చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సమాజం మొత్తంలో దిగ్బ్రాంతి వ్యక్తం చేసే ఘటన ఒక వెలుగులోకి వచ్చింది. పరీక్షలో తక్కువ మార్కులు వేశాడని ఏకంగా ఉపాధ్యాయుడినే చెట్టుకు కట్టేసి చితకబాదారు విద్యార్థులు. ఉపాధ్యాయుడి కాపాడానికి వచ్చిన ఆ పాఠశాల క్లర్కును కూడా విద్యార్థులు వదిలిపెట్టలేదు. క్లర్కు కూడా చెట్టుకు కట్టేసి చితక బాదారు. ఈ దారుణమైన ఘటన జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగింది.
వివరాల్లోకెళ్తే.. జార్ఖండ్ దుమ్కా జిల్లా గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ షెడ్యూల్డ్ ట్రైబ్ రెసిడెన్షియల్ స్కూల్ లో సుమన్ కుమార్ అనే వ్యక్తి గణిత ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. అయితే.. ఇటీవల జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ ( జేఏసీ) విడుదల చేసిన ఫలితాల్లో ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 32 మంది విద్యార్థుల్లో 11 మంది గ్రేడ్-డిడి పొంది.. ఫెయిల్ అయ్యారు. తమకు ప్రాక్టికల్స్ లో లెక్కాల మాస్టారు తక్కువ మార్కులు వేశాడని విద్యార్థులు ఆగ్రహం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న లెక్కాల మాస్టారు సుమన్ కుమార్ పై విద్యార్థులంతా మూక్ముడిగా దాడి చేశారు. విచక్షణరహితంగా చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ దాడిని గమనించిన వచ్చిన ఆ పాఠశాల క్లర్క్ ను కూడా వదలేదు. ఆయన కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు.
అయితే.. ఈ సంఘటనపై పాఠశాల యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై గోపికందర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నిత్యానంద్ భోక్తా మాట్లాడుతూ.. ఈ సంఘటనపై పాఠశాల యాజమాన్యం ఎటువంటి వ్రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వనందున ఈ విషయంలో ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడలేదు. సంఘటనను ధృవీకరించిన తర్వాత.. మేము పాఠశాల సిబ్బందిని ఫిర్యాదు చేయమని కోరాము, కానీ వారు విద్యార్థుల కెరీర్ను నాశనమయ్యే ప్రమాదం ఉందని వారు నిరాకరించారు.
దెబ్బలు తిన్న ఉపాధ్యాయుడిని సుమన్ కుమార్, క్లర్క్ సోనే రామ్ చౌరేగా గుర్తించారు. బాధిత ఉపాధ్యాయుడు కూడా పోలీసులకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వలేదని తెలిపారు. గోపికందర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (BDO) అనంత్ ఝా కూడా ఈ విషయాన్ని పరిశోధించడానికి భోక్తాతో పాటు పాఠశాలకు వచ్చారు. రెసిడెన్షియల్ పాఠశాలలో 200 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారిలో పెద్ద సంఖ్యలో ఈ ఘటనలో పాల్గొన్నారని తెలిపారు.