డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ పై ఆరోపణలు: మేరీకోమ్ నేతృత్వంలో కమిటీ
రెజ్లింగ్ ఫెరడేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో కేంద్ర క్రీడా శాఖమంత్రి కమిటీని ఏర్పాుటు చేశారు. నాలుగు వారాల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ధిగ్గజ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో ఒలంపిక్ విజేత యోగేశ్వర్ దత్, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత తృప్తి ముర్గుండే , రాధిక శ్రీమన్, రాజేష్ రాజగోపాలన్ లు సభ్యులుగా ఉంటారు. ఆరోపణలు చేసిన వారితో పాటు ఇతర అథ్లెట్ల నుండి ఈ కమిటీ సమాచారాన్ని సేకరించనుంది. క్రీడాకారుల మనోవేదనను పరిష్కరించడానికి డబ్ల్యుఎఫ్ఐలో సుపరిపాలనను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను ఈ కమిటీ సూచించనుంది.
లైంగిక వేధింపుల ఆరోపణలు, బెదిరింపులు, ఆర్ధిక అవకతవకలు వంటి విషయమై రెజర్లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై కేంద్ర స్పోర్ట్స్ మంత్రిత్వశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. మేరీకోమ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నాలుగు వారాల్లో విచారణ నిర్వహించి నివేదికను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
డబ్ల్యుఎప్ఐ రోజువారీ పనితీరును నిర్వహించడమే కాకుండా రెజర్లు చేసిన తీవ్రమైన ఆరోపణలపై కూడా విచారణ చేసి ఈ కమిటీ నివేదికను అందించనుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
ఈ కమిటీ విచారణ పూర్తయ్యే వరకు డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ విదులు నిలిపివేయాలని ఆదేశించినట్టుగా కేంద్ర మంత్రి ఠాకూర్ చెప్పారు. డబ్ల్యుఎఫ్ఐ రోజూవారీ పనుల్లో కూడా జోక్యం చేసుకువద్దని బ్రిజ్ భూషన్ ను కోరినట్టుగా మంత్రి చెప్పారు. ఢబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడిపై పలు ఆరోపణలు చేస్తూ రెజర్లు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు కేంద్ర మంత్రి నివాసంలో జరిగిన చర్చల తర్వాత రెజర్లు నిరసనను విరమించారు.