ఇటుక బట్టీలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి.. పలువురి పరిస్థితి విషమం..
బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఇటుక బట్టీలో జరిగిన పేలుడులో ఆరుగురు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. మోతీహరిలోని రామ్గర్వా ప్రాంతంలోని ఇటుక బట్టీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇటుక బట్టీ యజమాని మహ్మద్ ఇష్రార్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బీహార్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు చంపారన్ జిల్లాలోని ఇటుక బట్టీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. డిసెంబర్ 23, శుక్రవారం నాడు మోతీహరిలోని రామ్గర్వా ప్రాంతంలోని ఇటుక బట్టీలో భారీ పేలుడు సంభవించింది.
దీంతో ప్రమాదం సమయంలో అందులో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు మరణించగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇటుక బట్టీ యజమాని మహ్మద్ ఇష్రార్ కూడా ఉన్నట్లు స్థానిక పోలీసులు నిర్ధారించారు. జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్ ఘటనా స్థలానికి చేరుకున్నారని బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రకటనలో తెలిపింది.
రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో పలు అగ్నిమాపక సిబ్బంది రెస్యూ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిపారు.
సీఎం నితీష్ కుమార్ సంతాపం
మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఈ నష్టాన్ని భరించే శక్తిని బాధిత కుటుంబాలకు భగవంతుడు ప్రసాదించాలని కోరారు. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.