అలా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఎక్కడిది? మనీష్ సిసోడియాతో పోలీసుల దురుసుతనంపై ఆప్ ఆగ్రహం
Delhi Excise Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూన్ 1 వరకు పొడిగించింది. ఇదిలావుండగా, కోర్టులో మనీష్ సిసోడియా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆప్ ఆరోపించింది. అయితే, ఆప్ ఆరోపణలను పోలీసులు ఖండించారు.
former Delhi Deputy Chief Minister Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాతో రూస్ అవెన్యూ కోర్టులో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సిసోడియాను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కోర్టు గది నుంచి బయటకు తీసుకువచ్చిన వీడియోను ఢిల్లీ మంత్రి అతిషి ట్వీట్ చేస్తూ.. 'రూస్ అవెన్యూ కోర్టులో మనీష్ తో ఈ పోలీసు దురుసుగా ప్రవర్తించాడు. ఢిల్లీ పోలీసులు వెంటనే అతడిని సస్పెండ్ చేయాలి' అని ఆమె లేఖలో పేర్కొన్నారు.
అతిషి ట్వీట్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. మనీష్ సిసోడియాతో ఇలా అసభ్యంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా? ఇలా చేయాలని పోలీసులను ఆదేశించారా? అని ప్రశ్నించారు.
ఆరోపణలను ఖండించిన పోలీసులు
అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఢిల్లీ పోలీసులు వీడియోలో చూపించిన పోలీసుల చర్య భద్రతకు అవసరమని చెప్పారు. రౌస్ అవెన్యూ కోర్టులో మనీష్ సిసోడియాతో పోలీసు దురుసుగా ప్రవర్తించిన విషయం ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. వీడియోలో చూపించిన పోలీసుల ప్రతిస్పందన భద్రతా దృష్ట్యా అవసరమని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వడం చట్ట విరుద్ధం' అని ఢిల్లీ పోలీసులు ట్వీట్ లో పేర్కొన్నారు.
మోడీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.. : సిసోడియా
సిసోడియాను కోర్టు నుంచి బయటకు తీసుకువస్తున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ సర్వీసుల వ్యవహారంపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తీసుకొచ్చిన బిల్లును ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. మోడీ చాలా అహంకారపూరితంగా తయారయ్యారని మండిపడ్డారు.
మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 1 వరకు పొడిగించింది. ఢిల్లీ మాజీ మంత్రికి జైలు లోపల పుస్తకాలతో పాటు కుర్చీ, టేబుల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని న్యాయమూర్తి జైలు అధికారులను ఆదేశించారు.