నగల దుకాణం యజమాని కంట్లో కారం చల్లి...
బుధవారం రాత్రి దేవాస్ పట్టణానికి చెందిన ఆనంద్ అనే దొంగ నగలు కొనేందుకు అని చెప్పి నగల దుకాణానికి వచ్చాడు. పథకం ప్రకారం.. ముందుగా తన వద్ద కారం పొడి తెచ్చుకున్నాడు.
ఓ దొంగ.. నగల దుకాణంపై కన్నేశాడు. దుకాణం యజమానిని బురిడీ కొట్టించి.. అక్కడ బంగారాన్ని కాజేయాలని ప్లాన్ వేశాడు. తన ప్లాన్ లో భాగంగా దుకాణానికి వెళ్లి.. యజమాని కంట్లో కారం చల్లి.. దాదాపు 50 గ్రాముల బంగారాన్ని కాజేయడానికి ప్రయత్నించాడు. అయితే.. స్థానికులు అతని ఆట కట్టించారు. పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మధ్యప్రేదశ్ రాష్ట్రం ఇండోర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండోర్ నగరంలోని సరఫా ప్రాంతంలో లవీన్ సోని బంగారు నగల దుకాణం నడుపుతున్నాడు. బుధవారం రాత్రి దేవాస్ పట్టణానికి చెందిన ఆనంద్ అనే దొంగ నగలు కొనేందుకు అని చెప్పి నగల దుకాణానికి వచ్చాడు. పథకం ప్రకారం.. ముందుగా తన వద్ద కారం పొడి తెచ్చుకున్నాడు.
నగలు చూస్తున్నట్లుగా నటిస్తూ.. ఒక్కసారిగా షాపు యజమాని సోని కళ్లలో కారం కొట్టాడు. అతను బాధతో విలవిలలాడుతుండగా.. చాకచక్యంగా 50 గ్రాముల బంగారం తీసుకొని పారిపోయేందుకు యత్నించాడు. అంతలో అప్రమత్తమైన స్థానికులు అతని ఆట కట్టించారు. దొంగ ఆనంద్ ను పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నగల దుకాణంలో సీసీటీవీ ఫుటేజీలో బంగారం చోరీకి ఆనంద్ యత్నించాడని తేలింది.పోలీసులు నిందితుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకొని, అతన్ని అరెస్ట్ చేశారు.