రోడ్డుమీది గుంతలోనే స్నానం, యోగా... రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన..
ఎడతెరిపి లేని వర్షాలకు తోడు అధ్వాన్నమైన రోడ్లు.. ప్రజల జీవితాలను నరకంగా మార్చేస్తున్నాయి. కేరళలో ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఈ రోడ్ల దుస్థితి పై ఓ వ్యక్తి వినూత్న రీతిలో తన నిరసనను తెలిపాడు.
కేరళ : కేరళలో ఓ వ్యక్తి నడిరోడ్డుమీద పడ్డ గుంతలోనే స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం.. యోగా చేయడం లాంటి పనులతో నిరసన వ్యక్తం చేశాడు. ఎడతెరిపి లేని వర్షాలకు కేరళలోని రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూడు గుంతలతో నరకప్రాయంగా మారింది. దీనికి నిరసనగానే ఈ వ్యక్తి వినూత్నకార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఈ మొత్తం నిరసనను వీడియోలు, ఫొటోలు తీసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశాడు.
ఈ వీడియో క్లిప్లో, బకెట్, మగ్, సబ్బు, టవల్తో బయలుదేరిన వ్యక్తి, వర్షపు నీటితో నిండిన గుంటలో స్నానం చేస్తున్నాడు. అతను రోడ్డుపై ఉన్న బురద నీటి గుంటలోనే తన బట్టలు ఉతుకుతున్నాడు. దీన్నంతా రోడ్డు మీద వెడుతున్న వాహనదారులు ఆసక్తిగా గమనించడం కనిపిస్తుంది. కొంతమంది ఆగి, కారుల్లోంచి దిగి ఏమైందో కనుక్కుంటున్నారు. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. నిరసనకు దిగిన వ్యక్తిని హంజా పోరాలిగా గుర్తించారు.
యమధర్మరాజుకు రోడ్ల లీజ్.. బెంగళూరులో వినూత్న నిరసన...
వీడియోలో, స్థానిక ఎమ్మెల్యే యుఎ లతీఫ్ కూడా మిస్టర్ పోరాలి తన ప్రత్యేక నిరసనను నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకోవడం కనిపిస్తుంది. ఎమ్మెల్యే కారు దగ్గరకు వస్తుండగా, ఆ వ్యక్తి గుంతలో ధ్యాన భంగిమలో కూర్చొని కనిపించాడు. ఎమ్మెల్యే ముందు ఓ పెద్ద గుంత మధ్యలో నిలబడి యోగాసనాలు వేయడం కూడా రికార్డు అయింది. కేరళలో గుంతల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజుల తర్వాత ఈ వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఎర్నాకులం జిల్లాలోని నెడుంబస్సేరి వద్ద జాతీయ రహదారిపై గుంత కారణంగా స్కూటర్ పై వెడుతున్న 52 ఏళ్ల వ్యక్తి ఎగిరిపడి ట్రక్కును ఢీకొట్టాడు. అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ కేసును పరిగణనలోకి తీసుకున్న కేరళ హైకోర్టు వెంటనే గుంతలను పూడ్చాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)ని కోరింది. జిల్లా కలెక్టర్లు, జిల్లా విపత్తు నిర్వహణ అధికారుల హోదాలో, గుంతలు ఏ రోడ్డులో గుంతలు పడ్డాయో వాటికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసి, న్యాయపరిధిలోని ఇంజనీర్, కాంట్రాక్టర్లపై, బాధ్యులైన వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటారని జస్టిస్ దేవన్ రామచంద్రన్ సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది.
జూలైలో నెలలో బెంగళూరులోనూ ఓ వ్యక్తి ఇలాంటి వినూత్న నిరసనకే దిగాడు. ఈ రహదారులు నరకానికి మార్గాలంటూ.. యమధర్మరాజు వేషంలో.. దున్నపోతుతో రోడ్డుమీద ప్రత్యక్షమయ్యాడు. బెంగళూరులోని రోడ్ల దుస్థితి మీద నిరసనగా 'చేంజ్మేకర్స్ ఆఫ్ కనకపుర రోడ్' అనే సంస్థ ఈ నిరసనకు రూపకల్పన చేసింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.