నా భార్యను నాకివ్వండి.. కోర్టుకి ఎక్కిన యువకుడు
ఇలా ఉండగా ఐదు రోజుల క్రితం యువతి తల్లిదండ్రులు, బంధువులు కార్తికేయన్ ఇంటికి వచ్చి కార్తికేయన్, అతని తల్లిపై దాడి చేసి ప్రభను బలవంతంగా కారులో తీసుకెళ్లారు.
తన భార్యను తనకు అప్పగించాలంటూ ఓ యువకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరు గౌండమ్పాళయం సమీపంలోని ఇడయార్పాళయం విద్యా కాలనీకి చెందిన రాజేంద్రన్ కుమారుడు కార్తికేయన్ (35)కి తిరుచ్చి ప్రాంతానికి చెందిన ప్రభ(25) ని ప్రేమించాడు.
వీరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో.. వారి అంగీకారం లేకుండానే ఈ నెల 5వ తేదీన పెళ్లి చేసుకున్నారు. కాగా.. వీరి పెళ్లిని ప్రభ తల్లిదండ్రులు అంగీకరించలేదు.
అయితే కార్తికేయన్ తల్లిదండ్రులు అంగీకరించారు. ఇలా ఉండగా ఐదు రోజుల క్రితం యువతి తల్లిదండ్రులు, బంధువులు కార్తికేయన్ ఇంటికి వచ్చి కార్తికేయన్, అతని తల్లిపై దాడి చేసి ప్రభను బలవంతంగా కారులో తీసుకెళ్లారు.
ఈ దృశ్యాలు అక్కడున్న నిఘా కెమెరాల్లో నమోదయ్యాయి. దీని గురించి కుడియలూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రభను, రక్షించేందుకు తిరుచ్చికి వెళ్లారు. ఆ సమయంలో తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన తండ్రి అనారోగ్యంగా ఉన్నందున రెండు, మూడు రోజుల్లో ఊరికి తిరిగి వస్తానని తమిళిని ప్రభ పోలీసులకు తెలిపారు.
ఇలా ఉండగా కార్తికేయన్ మద్రాసు హైకోర్టులో మంగళవారం ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో కులాంతర వివాహం చేసుకున్నందున తన భార్యను కిడ్నాప్ చేశారని, ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆమెను పరువు హత్య చేసే అవకాశముందని, భార్యను తనకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.