నిద్రమాత్రలతో కూతురికి తల్లి స్పృహ తప్పించేది: పినతండ్రి అత్యాచారం చేసేవాడు
కర్ణాటకలో ఓ తల్లి తన కూతురు పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించింది. టీలో, ఆహారంలో నిద్రమాత్రలు కలిపి కూతురికి ఇచ్చేది. స్పృహ కోల్పోయిన తర్వాత యువతిపై పినతండ్రి అత్యాచారం చేసేవాడు.
బెంగుళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై వరుసకు పినతండ్రి అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దానికితోడు, అతనికి యువతి తల్లి సహకరించింది. ఈ సంఘటన ఉద్యాననగరిలో చోటు చేసుకుంది.
తనకు జరిగిన అన్యాయంపై 20 ఏళ్ల బాధితురాలు హుళిమావు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం, బెదిరింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరికెరె సామ్రాట్ లేఅవుట్ నివాస అయిన నిందితుడు అలెగ్జాండర్ దాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బాధితురాలి తల్లి రీమా కొన్నేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత అలెగ్జాండర్ దాస్ ను వివాహం చేసుకుంది. అలెగ్జాండర్ నిర్మాణ కంపెనీలో సూపర్ వైజరుగా పనిచేస్తున్నాడు. బాధిత యువతి ఓ కాలేజీలో చదువుతోంది. తల్లి, పినతండ్రులతో కలిసి అరెకెరెలోని అద్దె ఇంటిలో ఉంటోంది.
తల్లి టీ, ఇతర ఆహార పదార్థాల్లో నిద్రమాత్రలు కలిపి కూతురుకి ఇచ్చేది. మత్తులోకి జారుకున్న తర్వాత యువతిపై పినతండ్రి అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఏడాదిన్నర క్రితం పనిమీద హైదరాబాదుకు తీసుకుని వెళ్లి హోటల్ రూంలో బలవంతంగా మద్యం తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఆరోపించింది. ఉదయం స్పృహలోకి వచ్చి చూసుకుంటే శరీరంపై దుస్తులు లేవు.
తనపై ఆ రకంగా తరుచుగా అత్యాచారానికి పాల్పడ్డాడని, దానిపై ప్రశ్నిస్తే మొబైల్ లాక్కుని కాలేజీకి వెళ్లవద్దని చెప్పారని, విషయాన్ని బయట పెడితే సహించేది లేదని బెదిరించారని యువతి చెప్పింది. దాంతో తీవ్రమనస్తాపానికి గురై ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయానని, తనకు ప్రాణ భయం ఉందని బాధితురాలు తన ఫిర్యాదులో చెప్పింది.
కాలేజీకి వెళ్లడాన్ని నిలిపేసి, మోడలింగ్ చేయాలని, ఆశ్లీల వీడియోలు తీయానలి, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని వేధిస్తూ వచ్చారని చెప్పింది. నిత్యం డ్రగ్స్, మద్యం తాగాలని తనపై నిందితుడు ఒత్తిడి పెట్టేవాడని కూడా చెప్పింది. తనకు తెలియకుండా పలుమార్లు మద్యం, డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి జారుకునేలా చేసేవాడని, ఇందులో తన తల్లి అతనికి సహకరించేదని చెప్పాదు.