విచిత్రం... ఒకే పెళ్లిపందిట్లో ఇద్దరిని పెళ్లాడిన యువకుడు
బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ సమీపంలోని తిక్రాలొహంగా గ్రామంలో ఇటీవల విచిత్రమైన వివాహం జరిగింది.
రాయ్పూర్: ఓ యువకుడు ఒకరికి తెలియకుండా మరో యువతిని ప్రేమించాడు. పెళ్లి విషయానికి వచ్చేసరికి ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో తేల్చుకోలేకపోయాడు. చివరకు ఇరు కుటుంబాలను ఒప్పించి ఇద్దరు యువతలను ఒకే పెళ్లిపందిట్లో పెళ్లాడాడు. ఈ విచిత్ర సంఘటన చత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది.
బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ సమీపంలో తిక్రాలొహంగా గ్రామానికి చెందిన చందు మౌర్య అనే యువకుడు హసీనా(19), సౌందర్య(21) అనే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమిస్తూ ఇంతకాలం మేనేజ్ చేశాడు కానీ పెళ్లి విషయం వచ్చేసరికి అతడి ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో ఇద్దరు అమ్మాయిల్లో ఎవరిని పెళ్ళాడాలో తర్జనభర్జన పడుతూ చివరకు ఎవరినీ నొప్పించకుండా వుండేందుకు ఓ విచిత్ర నిర్ణయం తీసుకున్నాడు.
ప్రేమించిన ఇద్దరమ్మాయిలను పెళ్లాడాలని మౌర్య నిర్ణయించుకున్నాడు. అందుకు తన తల్లిదండ్రులతో పాటు అమ్మాయిల తరపు పెద్దవారిని కూడా ఒప్పించాడు. ఇంకేముంది ఒకే పందిట్లో ఇద్దరమ్మాయిలను పెళ్లాడాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో ఈ విషయం బయటకు వచ్చింది.