భార్య కోడిగుడ్డు కూర చేయలేదని.. తాగిన మైకంలో..
ఆగ్రహానికి గురైన అతడు భార్యను చితకబాదాడు. అదే ఆవేశంతో అమాయకుడైన మూడేళ్ల కుమారుడిపై కూడా దాడి చేశాడు. ఆ వెంటనే అక్కడినుంచి పారిపోయాడు.
తాగిన మైకంలో ఓ తండ్రి కిరాతకానికి పాల్పడ్డాడు. భార్య కోడిగుడ్డు కూర చేయలేదనే కోపంతో తాగిన మైకంలో కన్న కొడుకును అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బులంద్షహర్ జిల్లాలోని నాగ్లా గ్రామానికి చెందిన సుభాష్ బంజరా అనే వ్యక్తి శనివారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు.
అనంతరం ఎగ్ కర్రీ చేయాలని భార్యను ఆదేశించాడు. అయితే ఎగ్ కర్రీ చేసేందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన అతడు భార్యను చితకబాదాడు. అదే ఆవేశంతో అమాయకుడైన మూడేళ్ల కుమారుడిపై కూడా దాడి చేశాడు. ఆ వెంటనే అక్కడినుంచి పారిపోయాడు.
సుభాష్ చేతిలో చిన్నారి తీవ్రంగా గాయపడటంతో ఖుజా ఏరియాలోని ఆసుపత్రికి అతన్ని తరలించారు. కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న సుభాష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.