మహిళను చంపి డెడ్బాడీని సంచిలో కుక్కి.. ఆటోలో.. ఆ తర్వాత లోకల్ ట్రైన్లో సంచిని తీసుకెళ్లి..!
మహారాష్ట్రలో ఓ దుండగుడు మహిళను కత్తితో పొడిచి ఆమె డెడ్ బాడీని ఓ సంచిలో కుక్కేశాడు. ఆ సంచిని చెత్తగా అందరికీ చెబుతూ బిల్డింగ్ దిగాడు. ఓ ఆటోలో గోరేగావ్ రైల్వే స్టేషన్ వరకు వెళ్లాడు. అక్కడ ఓ లోకల్ ట్రైన్ ఎక్కేసి కొద్ది దూరం వెళ్లాక ట్రాక్ పై డెడ్ బాడీని తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
ముంబయి: మహారాష్ట్రలో ఓ దుండగుడు ఏ మాత్రం జంకు లేకుండా దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో పొట్టలో పొడిచి ఓ వివాహితను చంపేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని సంచిలో కుక్కేశాడు. ఆ సంచిని మరో రెండు సంచుల్లో చేర్చాడు. అనంతరం.. అది చెత్త అని చెబుతూ చుట్టుపక్కల వారిని నమ్మిస్తూ పెద్ద టవర్ నుంచి కిందికి తెచ్చాడు. ఆ తర్వాత ఆటోలో రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి లోకల్ ట్రైన్లో తీసుకెళ్లాడు. చివరకు ఓ చోట ట్రాక్పై వదిలిపెట్టి పరారయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని గోరేవాగావ్లో చోటుచేసుకుంది.
తూర్పు గోరేగావ్ నగరంలో ఫిలిమ్ సిటీ సమీపంలో సంతోష్ నగర్లో సారికా చల్కే అనే 30 ఏళ్ల వివాహిత నివసించేది. ఆమె శాటిలైట్ టవర్లో పని మనిషిగా వర్క్ చేస్తున్నది. అదే టవర్లో 21 ఏళ్ల నిందితుడు వికాస్ ఖైర్నార్ కూడా పని చేస్తున్నాడు. వీరిద్దరూ సంతోష్ నగర్లోనే నివాసం ఉండటం, ఒకే చోట పని చేస్తుండటం మూలంగా మూడేళ్లుగా ఇద్దరికీ పరిచయం ఉన్నది.
అయితే, సారికాను వికాస్ లోబర్చుకోవాలని ప్రయత్నాలు చేశాడు. కానీ, ఆమె పట్టించుకోలేదు. కానీ, ఇంటి అవసరాల నిమిత్తం ఆమె రూ. 3 వేలు అప్పు తీసుకుంది. ఆ అప్పును తిరిగి ఇచ్చేయాలని వికాస్ అడిగాడు. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత సారికాను వికాస్ దారుణంగా హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. శాటిలైట్ టవర్ మూడో ఫ్లోర్లోని టాయిలెట్లో మే 23న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అనంతరం ఆ డెడ్ బాడీని సంచిలో కుక్కి.. ఆ సంచికి మరో రెండు సంచిలు తొడిగించాడు. ఆ తర్వాత ఆ సంచిని చెత్తగా చెప్పుకుంటూ టవర్ కిందకి దిగాడు. ఓ ఆటోలో సంచిని ఎక్కించి అతను కూడా గోరేగావ్ రైల్వే స్టేషన్లో దిగాడు. ఆ తర్వాత అక్కడ స్లో లోకల్ ట్రైన్ లగేజ్ కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. ఆ ట్రైన్ చర్చిగేట్ వైపు వెళ్లింది. మాహిమ్, మాతుంగా రైల్వే స్టేషన్ మధ్యలో ఆ సంచిని ట్రాక్పై విసిరేసి అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు చెప్పారు.
ఈ సంచి గురించి పోలీసులకు ఫిర్యాదు రాగానే.. మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీశారు. సంతోష్ నగర్ ఏరియా నుంచి వచ్చిన ఫిర్యాదు పరిశీలించి ఆమెనే ఈ డెడ్ బాడీ అని పోలీసులు నిర్దారించారు. పోలీసులు ఆమె భర్తను కాంటాక్ట్ అయ్యారు. మే 23న ఉదయం 8 గంటలకు తన భార్య ఇంటి నుంచి పని చేయడానికి వెళ్తున్నా అని చెప్పి మళ్లీ తిరిగి రాలేదని చెప్పాడు. ఆయన చెప్పిన వివరాలు చూసి డెడ్ బాడీని అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నారు. బుధవారం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.