ఛత్తీస్ గఢ్ లో దారుణం.. యువతిని చంపి, మృతదేహాన్ని కారు ఢిక్కీలో కుక్కి..
డబ్బు సంబంధ లావాదేవీలతో ఓ వ్యక్తి తోటి ఉద్యోగిని దారుణంగా హతమార్చి, కారు డిక్కీలో కుక్కిన ఘటన ఛత్తీస్ ఘడ్ లో కలకలం రేపింది.
ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బిలాస్ పూర్ లో ఓ యువతిని ఆమె సహోద్యోగి దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత కారు డిక్కీలో దాచిపెట్టాడు. అయితే, యువతి కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా ఈ విషయం వెలుగు చూసింది. నిందితుడు ఆశిష్ సాహూను పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించారు. బిలాయికి చెందిన ప్రియాంక సింగ్ అనే యువతి దయాల్ బంద్ ప్రాంతంలో నివసిస్తూ ప్రైవేటు సంస్థలో పని చేస్తుంది.
గత నాలుగు రోజులుగా ఆమె కనిపించకుండా పోయింది. దీంతో అంతటా వాకబు చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రియాంక కాల్ డేటాను పరిశీలించారు. ఆమె చివరగా తన సహోద్యోగి ఆశిష్ తో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అసలు విషయం బయటపడింది. ప్రియాంకను హత్య చేసి.. మృతదేహాన్ని కారులో దాచి పెట్టానని అంగీకరించాడు.
దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డోరు తెరవగా ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించింది. మృతదేహం కుళ్లిపోయిందని, యువతి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామని.. ఫలితాలు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఛత్తీస్ గఢ్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
అయితే, ఈ హత్య వెనుక డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు భిలాయ్కు చెందిన వ్యక్తి. నిందితుడు దయాల్బంద్ ప్రాంతంలో మెడికల్ షాపును నడుపుతున్నారు. ప్రియాంక సింగ్ దయాల్బంద్లోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పిఎస్సి) పరీక్షకు సిద్ధమవుతోంది.
ఆశిష్ సాహు ప్రియాంక సింగ్తో కొంతకాలం స్నేహం చేసి, షేర్ మార్కెట్లో కొంత డబ్బును పెట్టుబడిగా పెట్టమని డబ్బులు బాగా వస్తాయని చెప్పాడు. దీంతో ఆమె డబ్బులు పెట్టింది. అలా మొదట్లో ప్రియాంక సింగ్కు రూ. 4 లక్షల నుంచి 5 లక్షల వరకు రిటర్న్లు లభించాయని, అయితే ఆతరువాత రూ. 11 లక్షలు పోగొట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
నవంబర్ 15న బాధితురాలు ఆశిష్ సాహు మెడికల్ స్టోర్కు వెళ్లి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నిందితుడు బాధితురాలిని తుండుతో గొంతు బిగించి చంపాడు. ఆ తరువాత మృతదేహాన్ని దుకాణం లోపల ఉంచాడు. కాని కొద్దిసేపటికే ఆవరణ నుండి దుర్వాసన రావడం ప్రారంభించింది. అనంతరం మృతదేహాన్ని శనివారం తన కారులో స్వగ్రామానికి తీసుకెళ్లి కారును అక్కడే వదిలేసి వచ్చాడు. కొద్ది రోజులుగా కూతురు ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబసభ్యులు మిస్సింగ్ ఫిర్యాదును నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
ప్రియాంక సింగ్ మొబైల్ నంబర్ ఆధారంగా, డబ్బుకు సంబంధించిన వివాదంలో ఆమెను హత్య చేసినట్లు అంగీకరించిన ఆశిష్ సాహును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారి తెలిపారు.