బాబోయ్.. మృతదేహంతో రోజుల తరబడి ఇంట్లోనే.. డబ్బులు లేక అంత్యక్రియలు చేయలేదంటూ...
డబ్బులు లేకపోవడంతో తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే పెట్టుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగు చూసింది.
ఉత్తర్ ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి చనిపోయి ఐదు రోజులు గడుస్తున్నా మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గుల్రిహా ప్రాంతంలో కలకలం రేపింది. 45 ఏళ్ల ఆ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని రోజుల తరబడి తన ఇంట్లో దాచిపెట్టాడని పోలీసులు మంగళవారం తెలిపారు. తన వద్ద డబ్బు లేకపోవడంతో తల్లి అంత్యక్రియలు నిర్వహించలేకపోయానని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అయితే ఆ వ్యక్తి మద్యానికి బానిసై, మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.
మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికితీశారు. శివపూర్-షాబజ్గంజ్లో ఇది జరిగింది. ఆ ఇంటికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాన్ని శాంతి దేవి (82) అనే మహిళదిగా గుర్తించారు. ఆమె రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారని నార్త్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మనోజ్ కుమార్ అవస్తీ తెలిపారు.
వార్నీ... లంచం తీసుకుంటూ పట్టుబడి పోలీసు..ఆధారాలు దొరకొద్దని ఏకంగా నోట్లనే మింగేశాడు..
ఆమె చనిపోయి నాలుగు-ఐదు రోజులు అయి ఉండొచ్చని తెలిపారు. మహిళ కుమారుడు నిఖిల్ మిశ్రా అలియాస్ డబ్బు మద్యానికి బానిసయ్యాడు. అంతేకాదు, అతని మానసిక స్థితి సరిగా ఉండదని కూడా అవస్థి తెలిపారు. ఏం జరిగిందని ప్రశ్నిస్తే కూడా సరిగా చెప్పలేకపోయాడని ఏఎస్పీ తెలిపారు. ఐదు రోజుల క్రితం తన తల్లి చనిపోయిందని, అయితే డబ్బులు లేకపోవడంతో అంత్యక్రియలు చేయలేకపోయానని చెప్పుకొచ్చాడని తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ మహిళకు అతను ఒక్కడే కొడుకు అని పోలీసులు తెలిపారు. మిశ్రా, అతని తల్లితో పాటు.. మిశ్రా భార్య, అతని కుమారుడు కూడా అదే ఇంట్లో ఉండేవారు. అయితే మిశ్రా తాగుడు, మానసిక స్థితి కారణంగా భార్యతో తరచూ గొడవ పడుతుండడంతో ఆమె 15 రోజుల క్రితం తన కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో కొంతమంది కిరాయికి ఉండే వాళ్ళని.. అయితే మిశ్రా ప్రవర్తన కారణంగా వారు కూడా నెల క్రితం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.