పరాయి స్త్రీలతో అఫైర్లు: మిత్రులతో గడపాలని భార్యపై ఒత్తిడి
గుజరాత్ లోని అహ్మదాబాదులో ఓ దుర్మార్గపు భర్త భార్యపై కట్నం కోసమే కాకుండా తన మిత్రులతో గడపాలని వేధిస్తూ వస్తున్నాడు. భర్తపై మహిళ అహ్మదాబాదు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాదులో అత్యంత నీచమైన ఘటన చోటు చేసుకుంది. అదనపు కట్నం కావాలని వేధించడమే కాకుండా తన స్నేహితులతో గడపాలని తన భార్యను వేధిస్తున్న నీచుడి ఉదంతం వెలుగు చూసింది. ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు.
భర్త వేధింపులను తట్టుకోలేక భార్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అహ్మదాబాద్ కు చెందిన మహిళ నగరానికే చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మహిళకు 40 ఏళ్లుంటాయి. వారి వివాహం 2002లో జరిగింది.
కట్నంగా 50 తులాల బంగారం పెట్టారు. వివాహం జరిగిన ఆరు నెలల తర్వాత అదనపు కట్నంగా కారు, మరిన్ని డబ్బుులు కావాలని వేధించడం ప్రారంభించాడు. ఆ తర్వాత కూడా మరిన్ని డబ్బుల కోసం వేధించడం ప్రారంభించాడు.
తన స్నేహితులతో గడపాలని భార్యపై దుర్మార్గుడు వేధిస్తూ వచ్చాడు. దానికి నిరాకరించడంతో ఆమెపై దాడికి దిగాడు. దీంతో ఆమె అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.