Cocaine Seized :  దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున కస్టమ్స్‌ అధికారులు కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు.లాగోస్‌ నుంచి దోహా మీదుగా ఢిల్లీకి వచ్చిన  లైబీరియాకు చెందిన ఓ వ్యక్తి నుంచి దాదాపు రూ. ₹ 90 కోట్ల విలువైన డ్ర‌గ్స్ ను ప‌ట్టుకున్నారు. అనంత‌రం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు త‌మ‌దైన స్టైల్ లో విచారిస్తున్నారు.  

Cocaine Seized : క‌స్టమ్స్ అధికారులు ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ మాఫియా.. ఏ మాత్రం తగ్గడం లేదు. అనేక కొత్త కొత్త మార్గాల్లో డ్రగ్స్‌ను దేశ విదేశాలకు అక్ర‌మంగా త‌ర‌లిస్తూ.. అడ్డంగా పట్టు బడుతున్నారు. భారీ మొత్తంలో డ్రగ్స్‌ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మరి పట్టుబడని డ్రగ్స్ ఇంకెంత స్థాయిలో దేశాలు దాటుతున్నాయో. తాజాగా దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున కస్టమ్స్‌ అధికారులు కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. లైబీరియాకు చెందిన ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో కొకైన్ ను ప‌ట్టుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు రూ ₹ 90 కోట్ల ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

వివరాల్లోకెళ్తే.. లైబీరియాకు చెందిన వ్యక్తి .. సోమవారం లాగోస్ నుంచి దోహా మీదుగా ఢిల్లీకి వచ్చారు. అయితే.. అత‌ని క‌ద‌లిక‌పై అనుమానం వ‌చ్చిన క‌స్ట‌మ్స్ అధికారులు త‌న‌దైన శైలిలో ప‌రిశీలించ‌గా.. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆ వ్య‌క్తి ఎంతో చ‌క‌చ‌క్యంగా.. ట్రాలీ బ్యాగ్‌లో మాదక ద్రవ్యాలుగా త‌ర‌లిస్తున్నారు. ఆ బ్యాగ్ అడుగు భాగంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం రాకుండా.. ఆఫ్-వైట్, వైట్ కలర్ 
రంగులో ఎనిమిది ప్యాకెట్లలో కొకైన్ ను ప్యాక్ చేసి త‌ర‌లిస్తున్నాడు. ఆ బ్యాగ్ ను పూర్తిగా ప‌రిశీలించగా.. అస‌లు విషయం బ‌య‌ట‌ప‌డింది. ఆ బ్యాగ్ నుంచి దాదాపు 5.9 కిలోల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో ₹ 89.74 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 లోదుస్తుల్లో బంగారం త‌ర‌లింపు

ఇదిలా ఉంటే.. దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద పెద్ద ఎత్తున్న‌ బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. ప్రయాణికుడు తన అండర్ వేర్‌లో బంగారాన్ని ఉంచి తరలిస్తున్నాడు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 478.520 గ్రాముల బంగారాన్ని పట్టుకుని సీజ్ చేశారు. పట్టుకున్న బంగారం విలువ 24.820 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికున్ని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.