ఢిల్లీలో కారు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీని ధాటికి బాధితుడు బానెట్‌పై పడి వేలాడుతున్నాడు.. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు. ప్రమాదం తర్వాత తన కుమారుడికి ఆశ్రయం ఇచ్చినందుకు మాజీ బ్యూరోక్రాట్‌ను కూడా అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు పోలీసులు.

దేశ రాజధాని ఢిల్లీలో (delhi) దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని గ్రేటర్‌ కైలాష్‌ (Greater Kailash) ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీని ధాటికి బాధితుడు కారు బానెట్‌పై పడి వేలాడుతున్నాడు.. అయినప్పటికీ కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు . ఈ క్రమంలో కారు కొంత దూరం వెళ్లిన తరువాత బానెట్‌పై పడిన వ్యక్తి జారిపోయి రోడ్డు మీద పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలవ్వగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రుడిని 37 ఏండ్ల ఆనంద్ విజయ్ మండేలియాగా (Anand Vijay Mandelia ) గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్‌తో పాటు కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించిన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెజటిన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని 27 ఏళ్ల రాజ్ సుందరంగా గుర్తించారు. అతను ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో లా చదువుతున్నాడు. 

మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు .. రాజ్ సుందరం (Raj Sundaram) తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కావడం గమనార్హం. ప్రమాదం తర్వాత తన కుమారుడికి ఆశ్రయం ఇచ్చినందుకు సదరు మాజీ బ్యూరోక్రాట్‌ను కూడా అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు పోలీసులు. ఈ కారు కొత్తగా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోగా.. పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశారు. 

ఇక ఢిల్లీలోనే గత నెలలో జరిగిన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తన కారుతో ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఓ ఫుడ్ డెలీవరి బాయ్ దుర్మరణం పాలయ్యాడు. మద్యం మత్తులో కారును నడిపిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడిని సలీల్ త్రిపాఠిగా గుర్తించారు. అతను తల్లి, భార్య, బిడ్డతో కలిసి బుద్ధ విహార్‌లో నివసిస్తున్నాడు.