శ్వాస, ఛాతి నొప్పితో... కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వార్డ్ బాయ్ మృతి
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే ఓ వార్డు బాయ్ అనారోగ్యంతో మృతి చెందాడు.
లక్నో: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వార్డు బాయ్ మరుసటి రోజే మృతిచెందాడు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా ఆస్పత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేసే మహిపాల్ సింగ్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదటిరోజు టీకా తీసుకున్నాడు. కానీ ఆ మరుసటి రోజే అనారోగ్యంతో అతడు మృతి చెందాడు. దీంతో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో భయాందోళన మొదలయ్యింది.
శనివారం మహిపాల్ సింగ్ సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' తీసుకున్నాడు. అయితే ఆ తర్వాతిరోజు(ఆదివారం) అతడు శ్వాస సంబంధిత సమస్యలతో పాటు ఛాతినొప్పితో బాధపడ్డాడు. ఈ సమస్యలు మరింత తీవ్రమవడంతో చివరకు అతడు ప్రాణాలు వదిలాడు.
read more వ్యాక్సిన్ వేసుకున్న హెల్త్ వర్కర్కు అస్వస్థత.. !
మహిపాల్ సింగ్ మృతిపై చీఫ్ మెడికల్ అధికారి స్పందిస్తూ... వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్లే అతడు చనిపోయాడని అనుకోవడం లేదన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోగా ఆరోగ్యంగానే వున్నాడు. కానీ ఆ మరుసటి రోజు అనారోగ్య సమస్యలు మొదలయి చనిపోయాడు. కాబట్టి వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్లే అతడు చనిపోలేదని భావిస్తున్నామన్నారు.