భార్యకు దూరం కావడానికి భర్త మాష్టర్ ప్లాన్..!
ఒక ప్రైవేటు ల్యాబ్ నుంచి కోవిడ్ సోకిన వ్యక్తి రిపోర్ట్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. దానిపై అతని పేరును మార్చి, తన పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత , ఆ రిపోర్ట్ను తన భార్య, తల్లిదండ్రులకు వాట్సప్ చేశాడు.
మన దేశంలో కరోనా మహమ్మారి ఎంతలా విలయతాండవం చేసిందో మనందరికీ తెలిసిందే. కరోనా సోకిన వారు.. ఇతరులకు దూరంగా ఉండాలని.. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు మొదటి నుంచీ చెబుతున్నాయి. కాగా.. ఈ క్రమంలో.. ఈ ఐసోలేషన్ విధానాన్ని కొందరు తమ స్వార్థం కోసం వినియోగించుకోవడం గమనార్హం. తాజాగా.. ఇలాంటి సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండోర్లోని మోవ్ అనే ప్రాంతంలో 26 ఏళ్ల వ్యక్తికి గడిచిన ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అతనికి భార్య, ఇంట్లోవారితో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎలాగైనా ఇంట్లో నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నాడు. కాగా, దీనికోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఒక ప్రైవేటు ల్యాబ్ నుంచి కోవిడ్ సోకిన వ్యక్తి రిపోర్ట్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. దానిపై అతని పేరును మార్చి, తన పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత , ఆ రిపోర్ట్ను తన భార్య, తల్లిదండ్రులకు వాట్సప్ చేశాడు.
అయితే, కుటుంబ సభ్యులు,ఈ వాట్సప్ చూసి షాక్కు గురయ్యారు. ఎందుకంటే అతనికి ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. దీంతో, వారికి తమ కుమారుని ప్రవర్తనపై అనుమానం కలిగింది. వారు వెంటనే ఆ వాట్సప్లో ఉన్న ప్రైవేటు ల్యాబ్ను వెళ్లి సంప్రదించారు. అప్పుడు వారికి తమ కొడుకు చేసిన మోసం బయటపడింది. దీంతో, ఆశ్చర్యపోయి, వారు ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ఆ ల్యాబ్ టెక్నిషియన్ మాత్రం, తమ ల్యాబ్ రిపోర్ట్ను ఫోర్జరీతో మార్పిడి చేసినందుకుగాను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గ్వల్టోలి పోలీసులు నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదుచేశారు.