భార్యాభర్తల మధ్య కేవలం చికెన్ కోసం జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. తమ గొడవలో తలదూర్చిన వ్యక్తిని భర్త అతి కిరాతకంగా కొట్టిచంపిన ఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

మధ్య ప్రదేశ్ : పక్కింట్లోని బార్యాభర్తల చికెన్ గొడవలో తలదూర్చడమే అతడి తప్పయ్యింది. భార్యకు మద్దతుగా మాట్లాడి తనకు మంచిమాటలు చెప్పడం రుచించక పక్కింటి వ్యక్తిపై కోపం పెంచుకున్న భర్త దారుణానికి ఒడిగట్టాడు. బాగా తాగిన మైకంలో పక్కింటికి వెళ్లి భార్యాభర్తల గొడవను విడిపించిన వ్యక్తిపై అత్యంత కిరాతకంగా కర్రతో బాది చంపాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

 ఈ దారుణానికి సంబంధించి స్థానిక ఎస్పీ కిరణ లతా కర్కేట తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భోపాల్ లోని బిఖిరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛవాని పత్తర్ గ్రామంలో పప్పు అహిర్వార్ భార్యతో కలిసి నివాసముండేవాడు. తాగుడుకు బానిసైన అతడు నిత్యం ఏదో విషయంలో గొడవపడేవాడు. ఇలా గత శుక్రవారం కూడా బాగా తాగేసి చికెన్ పట్టుకుని ఇంటికివచ్చిన అతడు వండాలని భార్యకు చెప్పాడు. కానీ భార్య చికెన్ వండేందుకు నిరాకరించడంతో అతడు కోపంతో ఊగిపోతూ ఆమెపై దాడికి దిగాడు.

Read more జార్ఖండ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై మూక దాడి, గ్యాంగ్ రేప్.. 10 మందిపై కేసు

భార్యభర్తల మధ్య చికెన్ గొడవ పెరిగి పెద్దది కావడంతో ఇరుగుపొరుగు ఇళ్లవారు గుమిగూడారు. ఈ క్రమంలోనే పక్కింట్లో వుండే బబ్లు అహిర్వార్ భార్యాభర్తలకు ఇలా గొడవపడటం మంచిది కాదని సర్దిచెప్పాడు. ఇలా మంచిమాటలు చెప్పడమే అతడి ప్రాణాల మీదుకు తెచ్చింది. భార్యాభర్తల గొడవలో తలదూర్చి తనకే నీతులు చెబుతాడా అని భావించాడో ఏమో బబ్లూ పై పప్పు కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే కర్ర తీసుకుని పక్కింటికి వెళ్లి బబ్లూపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. దీంతో తల పగిలి, శరీరంపైగా తీవ్ర గాయాలవగా కుటుంబసభ్యులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అయితే హాస్పిటల్ కు చేరేలోపే బబ్లూ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. 

ఇలా కేవలం చికెన్ కోసం భార్యాభర్తలు గొడవపడగా అందులో తలదూర్చి ప్రాణాలే కోల్పోయాడు బబ్లూ అహిర్వార్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పప్పు అహిర్వార్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.