దీదీ యూటర్న్.. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నది ప్రధాని మోదీ కాదు.
కేంద్ర ప్రభుత్వంపై విరుచుకపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ యూటర్న్ తీసుకున్నారు. ఈడీ, సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నది ప్రధాని మోదీ కాదన్నదని, బీజేపీలోని కొందరు అగ్ర నేతలు తమ వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని వాడుకుంటున్నారని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోడీపై నిత్యం దుర్గాదేవీలా నిప్పులు గక్కే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం యూటర్న్ తీసుకున్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. దాడులు చేస్తున్నది ప్రధాని మోదీ కాదన్నదని.. తనకు ఆ నమ్మకం ఉందని అన్నారు. 2014 నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న దీదీ.. అయితే బీజేపీలోని కొందరు అగ్ర నేతలు తమ వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా ఈడీ, సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయని అన్నారు.
సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల అధిక్యతకు వ్యతిరేకంగా అసెంబ్లీలో చేసిన తీర్మానంపై బెనర్జీ మాట్లాడుతూ.. 'ప్రతిపక్ష పార్టీల నేతలను సీబీఐ, ఈడీ అరెస్టు చేస్తామని బీజేపీ నేతలు ప్రతిరోజూ బెదిరిస్తున్నారని, దేశంలో కేంద్ర సంస్థలు ఇలాగే పనిచేయాలా? దీని వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని, నేను అనుకోను' అని బెనర్జీ అన్నారు. కొంతమంది బిజెపి నాయకులు తమ ప్రయోజనాల కోసం సిబిఐ, ఇడిలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయానికి నివేదించిన సిబిఐ ఇప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది" అని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై చర్యలు తీసుకునేలా సీబీఐ, ఈడీలను మోదీ దింపుతున్నారని గతంలో బెనర్జీ ఆరోపించడం గమనార్హం. ఈడీ, సీబీఐల వేధింపుల వల్ల పలువురు వ్యాపారులు దేశం విడిచి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ అజెండా, పార్టీ అజెండా కలువకుండా చూడాలని ప్రధాని మోదీకి సూచించారు. కేంద్రం, బీజేపీ అజెండా ఒక్కటే కావడం దేశానికి మంచిది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణిలో వ్యవహరిస్తోందనీ, ఈ తీర్మానం నిర్దిష్ట వ్యక్తికి వ్యతిరేకంగా కాదనీ, కేంద్ర సంస్థల పక్షపాత పనికి వ్యతిరేకంగా ఉందని అన్నారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 189 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 69 ఓట్లు వచ్చాయి. మరోవైపు.. సిబిఐ, ఇడిలకు వ్యతిరేకంగా ప్రతిపాదనలు రూపొందించడం అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధమని బిజెపి పేర్కొంది. బెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని బీజేపీ వ్యతిరేకించింది.
ప్రతిపక్ష నాయకుడు శుభేందు అధికారి, మరికొందరు కేంద్ర బిజెపి నాయకులు తృణమూల్ కాంగ్రెస్ నాయకులను వేధించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన బెనర్జీ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యక్తులను సిబిఐ లేదా ఇడి ఎప్పుడూ ఎందుకు పిలిపించడం లేదని ప్రశ్నించారు. మనది ఎన్నుకోబడిన ప్రభుత్వమని, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా విఫలమైనందున, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి, నిధులను నిలిపివేస్తూ మమ్మల్ని వేధిస్తున్నారని విమర్శించారు. సీఎం బెనర్జీ ప్రధానమంత్రిని పొగుడుతూ.. ఇతర పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ బీజేపీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
అవినీతి కేసుల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడంతో తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా అయోమయంలో పడింది. ఇప్పుడు స్వతంత్ర సంస్థను పరువు తీయాలని చూస్తున్నారని, అవినీతి పట్ల ప్రధాని ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తున్నారని, తృణమూల్ కాంగ్రెస్ పాపం తప్పించుకోలేకపోతుందని బీజేపీ ఆరోపించింది.
రాష్ట్రంలో పలువురు సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నేతలు నిందితులుగా ఉన్న పలు కేసులపై సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు విచారణ జరుపుతున్నాయి. బెనర్జీ ప్రకటన తరువాత.. తృణమూల్ కాంగ్రెస్, బిజెపి మధ్య రహస్య ఒప్పందం జరిగిందని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ ఆరోపించాయి.
దీదీ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. "తృణమూల్ కాంగ్రెస్, బిజెపి మధ్య రహ్యస ఒప్పందం జరిగిందని.. ఆ విషయం బహిర్గతం అవుతుందని ఆరోపించారు. ప్రతిపక్ష శిబిరంలో భయాందోళనలు సృష్టించడం బెనర్జీ పాత ట్రిక్ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం అన్నారు. ఇది కొత్త విషయం కాదు. రాష్ట్రంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో బెంగాల్ సీపీఐ(ఎం) కంటే కేరళ సీపీఐ(ఎం)ని బెటర్ అనడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ఇదే వ్యూహాన్ని అవలంబించేందుకు ప్రయత్నించిందని అన్నారు..