కాంగ్రెస్ అధ్యక్షుడినైతే సమిష్టి నిర్ణయాలు తీసుకుంటా.. : మల్లికార్జున ఖర్గే
Kolkata: “ఇవి కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలు. ఏ నిర్ణయమైనా అంతర్గతంగా, పరస్పర చర్చల ద్వారానే తీసుకుంటారు. 'నేను' కాదు.. 'మేము' కలిసి నిర్ణయాలు తీసుకుంటాము”అని మల్లికార్జున ఖర్గే ప్రచారం కోసం కోల్కతాకు వచ్చినప్పుడు మీడియాతో అన్నారు.
Mallikarjun Kharge: పార్టీ అధ్యక్ష పదవికి కీలక పోటీదారుగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే.. కాంగ్రెస్ వర్గాల మద్దతు కోరుతూ బెంగాల్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ఆ పదవికి తనను ఎన్నుకుంటే పార్టీలో “సమిష్టి నిర్ణయాల”పై మరింత ఒత్తిడి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాను ఒక్కడినే కాదనీ, అందరం కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకునేందుకు తగిన విధంగా ముందుకు నడిపిస్తానని ఆయన అన్నారు.“ఇవి కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలు. ఏ నిర్ణయమైనా అంతర్గతంగా, పరస్పర చర్చల ద్వారానే తీసుకుంటారు. 'నేను' కాదు.. 'మేము' కలిసి నిర్ణయాలు తీసుకుంటాము”అని మల్లికార్జున ఖర్గే ప్రచారం కోసం కోల్కతాకు వచ్చినప్పుడు బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు కాంగ్రెస్ పార్టీ పోర్ట్ఫోలియోలలో 50 శాతం రిజర్వేషన్లు కూడా ఆయన హామీ ఇచ్చారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఎవరూ నిర్దిష్ట కుర్చీకి అతుక్కుపోకూడదని కూడా ఆయన ప్రతిపాదించారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మేమంతా కోరుకున్నాం. ఈ విషయాన్ని మా అధినేత్రి సోనియా గాంధీకి కూడా తెలియజేశాం. అయితే గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయరని ఆమె చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాల గొప్ప వారసత్వాన్ని నిలబెట్టడంతోపాటు దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. మా పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను' అని మల్లికార్జున ఖర్గే తెలిపారు.
రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడైన 80 ఏండ్ల మల్లికార్జున ఖర్గే.. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను విమర్శించారు. నిరుద్యోగం రేటు పెరగడానికి, రూపాయి బలహీనపడటానికి ఇటువంటి నిర్ణయాలు కారణమని పేర్కొన్నారు. “మేము నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పాటు పెట్రోల్, డీజిల్కు వ్యతిరేకంగా ఉన్నాము. మా పోరాటం పాలు, గోధుమలు, నెయ్యిపై జిఎస్టికి వ్యతిరేకంగా కూడా కొనసాగుతుంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ, అమిత్ షా ల ప్రభుత్వంపై పోరాటం సాగిస్తాం" అని ఆయన అన్నారు.
కాగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేతో పాటు కేరళ పార్లమెంట్ సభ్యులు, ఆ పార్టీ నాయకుడు శశిథరూర్ కూడా పోటీ చేస్తున్నాయి. అయితే, పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (WBPCC) తమ మద్దతు ఖర్గేకు లేదా ఇతర పోటీదారు శశి థరూర్కు విస్తరిస్తుందా అనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి ప్రకారం, రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ రాహుల్ గాంధీని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేయాలని కోరింది. "కానీ అది జరగడం లేదు. WBPCC తరపున మేము మల్లికార్జున్ ఖర్గేకి స్వాగతం పలికాము. అదేవిధంగా త్వరలో రాష్ట్రానికి రానున్న శశిథరూర్కు కూడా స్వాగతం పలుకుతాం. అయితే, మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు”అని ఆయన చెప్పారు.