నెలరోజు పాటు డిజిటల్ చెల్లింపులు చేయండి.. ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి
డిజిటల్ చెల్లింపుల ద్వారా నెల రోజుల పాటు చెల్లింపులు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తన నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అభ్యర్థించారు.
![Make digital payments for a month.. Prime Minister Modi appeals to people..ISR Make digital payments for a month.. Prime Minister Modi appeals to people..ISR](https://static-ai.asianetnews.com/images/01hf4ettne7k0zmdwk8mfcvf6d/pm-modi--1699883084462_363x203xt.jpg)
నెల రోజుల పాటు కేవలం డిజిటల్ చెల్లింపులు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. పండుగ సీజన్ లో నగదు చెల్లింపులు తగ్గడంపై ప్రధాని సంతృప్తిని వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు యూపీఐ, ఇతర డిజిటల్ మాధ్యమం ద్వారా చెల్లింపులు జరిపి, దానికి సంబంధించిన ఫొటోలు, అనుభవాలను పంచుకోవాలని సూచించారు.
ప్రధాని తన నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దీపావళి పర్వదినం సందర్భంగా నగదు రూపంలో చెల్లించే విధానం నెమ్మదిగా తగ్గడం ఇది రెండోసారి అని అన్నారు. ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉందని తెలిపారు. భారతదేశంలో డిజిటల్ విప్లవం సాధించిన విజయం ఇది అని అన్నారు.
అలాగే 'స్వచ్ఛ భారత్ అభియాన్', 'వోకల్ ఫర్ లోకల్' కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రశంసించారు. భారతదేశంలో అనేక పరివర్తనలకు దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు నాయకత్వం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ సీజన్ లో ప్రజలు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఎంచుకుని 'వోకల్ ఫర్ లోకల్'కు వెళ్లడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన అన్నారు.
‘‘గత కొద్ది రోజుల్లోనే దీపావళి, భయ్యా దూజ్, ఛాత్ రోజున దేశంలో రూ.4 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. ఈ కాలంలో, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రజలలో విపరీతమైన ఉత్సాహం కనిపించింది. ఇప్పుడు మన పిల్లలు కూడా షాపులో ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు వాటిపై మేడ్ ఇన్ ఇండియా ప్రస్తావన ఉందో లేదో చెక్ చేసుకోవడం మొదలుపెట్టారు. అంతే కాదు ఆన్ లైన్ లో కూడా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు దేశాన్ని తనిఖీ చేయడం మర్చిపోవడం లేదు’’ అని అన్నారు.
'వోకల్ ఫర్ లోకల్' అనే ఈ ప్రచారం యావత్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, ఉపాధి, అభివృద్ధికి గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వోకల్ ఫర్ లోకల్ క్యాంపెయిన్ ఉపాధికి హామీ అని, అభివృద్ధికి గ్యారంటీ అని తెలిపారు. ఇది దేశ సమతుల్య అభివృద్ధికి హామీ అని చెప్పారు. ఇది పట్టణ, గ్రామీణ ప్రజలకు సమాన అవకాశాలను అందిస్తుందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడైనా హెచ్చుతగ్గులు ఉంటే, వోకల్ ఫర్ లోకల్ మంత్రం మన ఆర్థిక వ్యవస్థను కూడా రక్షిస్తుందని ఆయన అన్నారు.