టీచరమ్మకి కారు గిఫ్ట్ గా ఇచ్చిన విద్యార్థులు
ఆమె సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ బడిలోనే ఉండి... పిల్లలకు ప్రత్యేకంగా క్లాస్లు తీసుకుంటుంది. సెలవు రోజుల్లో కూడా ఈ పరీక్ష కోసం వారిని చదివిస్తుంది. ఆమె మాత్రం సెలవులు తీసుకోదు.
సెప్టెంబర్5 అనగానే అందరికీ గుర్తు వచ్చేది టీచర్స్ డే. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మనం ఈ రోజున టీచర్స్ డే జరుపుకుంటాం. ఈ రోజున విద్యార్థులంతా తమ గురువులకు పూజ చేస్తారు. ఇంకొందరు వారికి తోచిన బహుమతులు గురు దక్షిణంగా ఇస్తుంటారు. కానీ ఓ టీచరమ్మ మాత్రం ఏకంగా కారునే గురు దక్షిణగా పొందింది. ఆ బహుమతి ఇచ్చినవారంతా చిన్నచిన్న పిల్లలే కావడం గమనార్హం. వారి తల్లిదండ్రుల సహాయంతో తమ అత్యంత ప్రియమైన టీచర్ కి కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అంతమంది అభిమానాన్ని సంపాదించుకోవడానికి ఇంతకీ ఆ టీచరమ్మ ఏం చేసిందో తెలుసా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.
మహారాష్ట్రలోని షిరూర్ తాలూకా పింపుల్ఖల్సా గ్రామం. అక్కడ ఉన్న జిల్లా పరిషత్ స్కూల్కి చుట్టుపక్కలున్న గ్రామాల నుంచి పిల్లలు వచ్చి చదువుకుంటారు. అక్కడ ప్రస్తుతం మూడొందల యాభైమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అక్కడ లలితా దుమాల్ అనే టీచర్ దాదాపుగా చాలా కాలం నుంచి పని చేస్తోంది. అయితే ప్రతి సంవత్సరం ఐదో తరగతి చదివే పిల్లలు ఉపకార వేతనంతో కూడిన విద్యా ఫలాలను అందుకునేలా కొన్ని పరీక్షలు ఉంటాయి. అ విషయం తెలుసుకుని... ఐదో తరగతి చదివే పిల్లలకు లలిత కఠోరమైన శిక్షణ ఇచ్చింది. అంతేనా ఐదో తరగతిలో పందొమ్మిది మంది ఉంటే ఈసారి అందరూ పరీక్షలో పాసయ్యారు.
ఉపకారవేతనానికి ఎంపికయ్యారు. గతేడాది 21 మంది ఉత్తీర్ణులయ్యారు. లలిత దూర ప్రాంతం నుంచి బడికి వచ్చినా సరే పిల్లల కోసం అదనపు సమయం కేటాయిస్తుంది. ఆమె సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ బడిలోనే ఉండి... పిల్లలకు ప్రత్యేకంగా క్లాస్లు తీసుకుంటుంది. సెలవు రోజుల్లో కూడా ఈ పరీక్ష కోసం వారిని చదివిస్తుంది. ఆమె మాత్రం సెలవులు తీసుకోదు. గత నెల పదో తారీఖున ఉపకారవేతనం అందుకునే పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల వల్ల చాలామంది తల్లిదండ్రులకు పిల్లల చదువుల భారం తప్పింది. అందుకు అభినందనగానే ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆమెకి కారును కానుకగా ఇచ్చారు. పైగా ఆ కారు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా... ఆమె బడికి రాగలదని అనుకున్నారు. మరింత మందిని తీర్చిదిద్దేందుకు స్ఫూర్తి కూడా అవుతుందని భావించారు.