NCP Sharad Chandra Pawar : శరద్ పవార్ కొత్త పార్టీ పేరు .. ఏంటో తెలుసా..?
శరద్ పవార్ వర్గానికి ‘‘ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ .. శరద్ చంద్ర పవార్ ’’ అనే పేరును ఖరారు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. షనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని తిరుగుబాటు గ్రూప్ అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ ఈసీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
![Maharashtra : Sharad Pawar faction gets new name day after Ajit camp declared real NCP ksp Maharashtra : Sharad Pawar faction gets new name day after Ajit camp declared real NCP ksp](https://static-ai.asianetnews.com/images/01hp1xfnkjhdc1fa1raez79fsa/Sharad-Pawar-1707313976946_363x203xt.jpg)
మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక వర్గమైన అజిత్ పవార్ గ్రూపునే అసలైన ఎన్సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గానికి కొత్త పేరును కేటాయించింది ఈసీ. ‘‘ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ .. శరద్ చంద్ర పవార్ ’’ అనే పేరును ఖరారు చేసింది. త్వరలో మహారాష్ట్ర నుంచి ఖాళీ అవుతున్న ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీ పేరు, గుర్తులను ఎంచుకోవాలని ఎన్నికల కమీషన్ మంగళవారం సూచించింది. దీంతో శరద్ వర్గం మూడు పేర్లు, ఎన్నికల గుర్తులను ఈసీకి పంపింది. వీటిని పరిశీలించిన కమీషన్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ పేరుకు ఆమోదముద్ర వేసింది.
కాగా.. గతేడాది ఎన్సీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ సారథ్యంలో బీజేపీ-షిండే సర్కార్కు జై కొట్టిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే అజిత్ పవార్ డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేయగా, కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం దక్కింది. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు వుండగా.. వీరిలో ప్రస్తుతం 12 మంది మాత్రమే శరద్ గ్రూపులో వున్నారు. అజిత్ పవార్ తిరుగుబాటుతో అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరిదనే దానిపై రెండు వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని తిరుగుబాటు గ్రూప్ అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీపీ గడియారం గుర్తును సైతం అజిత్ వర్గానికి కేటాయించింది. అంతేకాకుండా బుధవారం మధ్యాహ్నం 3 గంటల లోపు తమ వర్గం పేరును, గుర్తును ఎన్నికల సంఘానికి తెలియజేయాలని శరద్ పవార్ వర్గానికి గడువు విధించింది.