Fuel prices: కేంద్రం బాటలో రాష్ట్రాలు.. మరింత తగ్గుతున్నపెట్రోల్, డీజిల్ ధరలు !
VAT on petrol and diesel: కేంద్ర ప్రభుత్వం బాటలోనే పలు రాష్ట్రాలు కూడా ముందుకు సాగుతున్నాయి. చమురు పై వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గిస్తుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత దిగువకు చేరుకుంటున్నాయి.
Fuel-VAT : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. కేంద్రం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చమురుపై సుంకాన్ని తగ్గిస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకోని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఒక రోజు తర్వాత, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు ఆదివారం పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు వ్యాట్ను తగ్గించాలని పిలుపునిచ్చినప్పటికీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ సేకరణలో లోటును చూపుతూ, అలా చేయడంలో ముందుకు సాగలేమని ప్రకటించాయి.
మహారాష్ట్రలో ఇంధన ధరలు యిలా ఉన్నాయి..
మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్పై లీటర్కు రూ.2.08, డీజిల్పై రూ.1.44 వ్యాట్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చమురుపై ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తగ్గింపు తర్వాత ఒక లీటర్ పెట్రోల్ ₹ 111.35గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ₹ 97.28గా ఉంది.
రాజస్థాన్ వ్యాట్ తగ్గించింది
దేశంలో అత్యధికంగా చమురు ధరలు ఉండే రాజస్థాన్ లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. కేంద్రం చమురుపై పన్నులను తగ్గించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్పై వ్యాట్ ను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్పై లీటర్కు రూ.2.48, డీజిల్పై రూ.1.16 చొప్పున వ్యాట్ను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
కేరళ ప్రభుత్వం చమురుపై పన్నులు తగ్గించింది
గతంలో కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్పై లీటర్కు రూ.2.41, డీజిల్పై రూ.1.36 చొప్పున వ్యాట్ను తగ్గించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే పెట్రోలు, డీజిల్పై పన్ను పెంచే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఎప్పుడూ సంప్రదించలేదని తమిళనాడు సర్కారు పేర్కొంది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు 2014 సంవత్సరం కంటే ఎక్కువగానే ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్పై సుంకాన్ని తగ్గించడం లేదని తెలిపారు. చాలా రాష్ట్రాలు రానున్న ఎన్నికల్లో లబ్ది పొందడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించిదని ఆరోపిస్తున్నాయి. మళ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత చమురు ధరలు ఆకాశమే హద్దుగా పెంచుతుందని హెచ్చరిస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది..
పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ శనివారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు రూ.8, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.6 తగ్గించారు. దీనితో పాటు, వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగించడానికి స్థానిక స్థాయిలో వ్యాట్ను తగ్గించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది.